విషాదంలో తెలుగు సినీలోకం.. సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి కన్నుమూత
By న్యూస్మీటర్ తెలుగు Published on 11 Feb 2020 12:59 PM GMTతెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు అనారోగ్యంతో కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రెండు రోజుల కింద వనస్థలిపురంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించడంతో మృతి చెందారు.
పసుపులేటి రామారావు స్వస్తలం ఏలూరు. డిగ్రీ పూర్తిచేసిన ఆయన.. అనంతరం ప్రజానాట్య మండలి, కమ్యూనిస్టు పార్టీలో పనిచేశారు. ఇక.. మెగాస్టార్ చిరు కుటుంబంతో ఆయనకు చాలా మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. పసుపులేటి.. మెగాస్టార్ చిరంజీవిపై నటజీవితంపై పుస్తకాలు రాశారు. ఖైదీ నెంబర్ -150 సినిమా విడుదలైన తర్వాత.. చిరు 150 సినిమాల ప్రయాణంపై ఈయన రాసిన 'చిరంజీవితం' పుస్తకం చాలా పాపులర్ అయింది.
1980లో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన రామారావు.. మొదట విశాలాంధ్ర పత్రికకు జర్నలిస్ట్గా పనిచేసారు. ఆ తర్వాత జ్యోతిచిత్ర పత్రికలో పనిచేసారు. ఆ తర్వాత కొన్ని సినిమాలకు పీఆర్వోగా పనిచేశారు. ప్రస్తుతం సురేష్ కొండేటి ఆధ్వర్యంలోని 'సంతోషం' సినీ పత్రికకు జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు.