'ఆపరేష్ గోల్డ్ ఫిష్ 'విడుదల తేదీ ఖరారు..రిలీజ్ ఎప్పుడు..?
By న్యూస్మీటర్ తెలుగు
హైదరాబాద్ :ఆది సాయికుమార్ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా... సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' (ఒ.జి.యఫ్). ప్రతిభా అడివి, కట్టా ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ .బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ , టెక్నిషియన్స్, నిర్మాతలు. సెన్సిబుల్ సినిమాలు 'వినాయకుడు', 'విలేజ్ లో వినాయకుడు', 'కేరింత'తో విజయాలు అందుకున్న సాయికిరణ్ అడివి, ఈసారి కశ్మీర్ పండిట్ల సమస్యలను వెండి తెరపై చూపించడానికి సిద్ధమయ్యారు. తీవ్రవాదం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. యు/ఎ సర్టిఫికెట్ లభించింది. అక్టోబర్ 18న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా సాయికిరణ్ అడివి మాట్లాడుతూ... " వాస్తవ ఘటనల ఆధారంగా కల్పిత కథాంశంతో రూపొందిన చిత్రమిది అన్నారు. ఎన్.ఎస్.జి కమాండోగా ఆది సాయికుమార్, ఘాజీ బాబా పాత్రలో అబ్బూరి రవి, ఫరూఖ్ ఇక్బాల్ ఇరాకీగా మనోజ్ నందం, ఇంకా శషా చెట్రి, కృష్ణుడు, నిత్యా నరేష్, పార్వతీశం, కార్తీక్ రాజు అద్భుతంగా నటించారు. ప్రచార చిత్రాలకు అద్భుత స్పందన లభిస్తోంది. శ్రీచరణ్ పాకాల చక్కటి స్వరాలను, నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాలో దేశభక్తి గీతాన్ని పాడిన కీరవాణిగారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆ పాటకు రామజోగయ్య శాస్త్రి గారు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. సినిమాపై ప్రేక్షకుల్లో నెలకొన్న అంచనాలను తప్పకుండా చేరుకుంటామన్న నమ్మకం ఉంది. సెన్సార్ సభ్యులు సినిమా బావుందని మెచ్చుకున్నారు. అక్టోబర్ 18న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం" అన్నారు.
ఆది సాయికుమార్ మాట్లాడుతూ... " తొలిసారి ఎన్.ఎస్.జి కమాండోగా నటించాను. నా లుక్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సాయికిరణ్ అడివి గారు కథపై ఎంతో పరిశోధన చేసి సినిమా తీశారు. కశ్మీర్ పండిట్ల జీవితాలను, అక్కడి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించారు. ప్రేక్షకులకు సినిమా తప్పకుండా నచ్చుతుంది" అన్నారు.
ఈ సినిమా ఫస్ట్ లుక్ ను మ్యాచో మ్యాన్ రానా దగ్గుబాటి విడుదల చేయగా, ఈ చిత్రంతో నటుడిగా పరిచయం అవుతున్న అబ్బూరి రవి లుక్ ను ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సినిమాలో బ్యాడ్ బాయ్ గా నటించిన మనోజ్ నందం ఫస్ట్ లుక్ ను సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ విడుదల చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా టీజర్ ఆవిష్కరించారు. ప్రచార చిత్రాలకు అద్భుత స్పందన లభిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి గారు సినిమాలో ఓ పాట పాడటం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఓ సినిమాలో పనిచేసే యూనిట్ సభ్యులందరూ కలిసి ఓ సినిమా నిర్మాణంలో భాగమవడం ఇదే తొలిసారి.