గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగులకు పౌష్టికాహారం
By సుభాష్ Published on 24 April 2020 9:42 AM GMTతెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పాజిటివ్ వచ్చిన వారిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. దీంతో కరోనా రోగులకు కూడా బలమైన ఆహారాన్ని అందజేస్తున్నారు. కరోనా బాధితులు ఐసోలేషన్లో ఉంచడం వల్ల మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఆ సమయంలో రోగికి ఇమ్యూనిటీ చాలా ముఖ్యం. రోగి త్వరగా కోలుకోవాలంటే ఒక్క మందులు మాత్రమే సరిపోవు. పౌష్టికాహారం కూడా ఎంతో అవసరం. దీంతో గాంధీ ఆస్పత్రిలో పాజిటివ్ వచ్చిన బాధితులకు రోజువారిగా పౌష్టికాహారం అందజేసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ఉదయం అల్పాహారంలో టిఫిన్, టీ అందజేస్తున్నారు. ఇందులో ఇడ్లీ, దోశ, చపాతీ, పాలు, బ్రెడ్డు కూడా అందజేస్తున్నారు. ఇక మధ్యాహ్నం సమయంలో లంచ్లో భాగంగా భోజనంలో రెండు రకాల కూరలు, అన్నంతో సహా పెరుగు, ఉడకబెట్టిన కోడిగుడ్డు, సాంబారు, మినరల్ వాటర్ ఇస్తున్నారు. ఇక స్నాక్స్గా బాదం, జీడిపప్పు వంటి డ్రైప్రూట్తో పాటు ఇతర పండ్లను కరోనా రోగులకు అందజేస్తున్నారు. కరోనా ఎదుర్కొనేందుకు పౌష్టికాహారాన్ని అందజేస్తున్నట్లు గాంధీ ఆస్పత్రి సిబ్బంది తెలిపారు.