సంగీత దర్శకుడు రాజన్ కన్నుమూత
By సుభాష్ Published on 12 Oct 2020 7:14 AM GMTప్రముఖ సంగీత దర్శకుడు రాజన్ (85) కన్నుమూశారు. కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని నివాసంలో ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న రాజన్.. పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు ఆయన కుమారుడు అనంత్కు మార్ తెలిపారు. రాజన్ తెలుగు, కన్నడ భాషల్లో అనేక సినిమాలకు సంగీతాన్ని అందించారు. వాటిలో ముఖ్యంగా తెలుగులో అగ్గి పిడుగు, పూజ, పంతులమ్మ, మూడుముళ్లు, సొమ్మొకడిది సోకొకడిది, ప్రేమ ఖైదీ, రెండు రెళ్లు ఆరు, నాగమల్లి, పులి బెబ్బులి, కిలాడీ దొంగలు వంటి సినిమాలకు సంగీతం అందించారు. రాజన్ తన సోదరుడు నాగేంద్రతో కలిసి ఈ స్వరాలను సమకూర్చేవారు.
1952లో విడుదలైన సౌభాగ్య లక్ష్మీ సినిమాతో సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. దాదాపు 37 ఏళ్లపాటు సినీ ఇండస్ట్రీకి సేవలు అందించారు. దాదాపు 375 సినిమాలకు రాజన్ సంగీతం అందించారు. తమిళ్తో పాటు తెలుగు, కన్నడ తదితర భాషల్లో ఆయన సంగీతం అందించారు. ఆయన మృతి పట్ల తెలుగు, కన్నడ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.