ఫ్రాన్స్‌లో దారుణం.. ఓ మ‌హిళ త‌ల‌న‌రికిన ఉన్మాది

By సుభాష్  Published on  30 Oct 2020 6:15 AM GMT
ఫ్రాన్స్‌లో దారుణం.. ఓ మ‌హిళ త‌ల‌న‌రికిన ఉన్మాది

ఫ్రాన్స్‌లో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియ‌ని ఓ దుండ‌గుడు దారుణంగా ఓ మ‌హిళ త‌ల న‌రికాడు. అంతేకాకుండా మ‌రో ఇద్ద‌రిని హ‌త్య చేశాడు. ఈ ఘ‌ట‌న నైస్ న‌గ‌రంలోని స్థానిక నోట్రే డేమ్ చ‌ర్చి స‌మీపంలో గురువారం ఉద‌యం చోటు చేసుకుంది. ఈ దాడిని అక్క‌డి నగర మేయర్ క్రిస్టియన్ ఎస్ట్రోసి ధృవీక‌రించారు. ఇది ఉగ్రవాద చర్యేనని.. దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. ఈ దారుణ ఘటనలో ముగ్గురు చనిపోగా.. ప‌లువురు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఇటీవలే ఫ్రాన్స్ లో ఓ ఉపాధ్యాయుడి తలను ఇస్లామిక్ అతివాదులు నరికారు. అక్టోబ‌ర్ మొద‌టి వారంలో పారిస్‌లో శామ్యూల్ పాటీ అనే స్కూల్ టీచ‌ర్‌ను చెచెన్ సంత‌తికి చెందిన ఓ యువ‌కుడు అతి దారుణంగా త‌ల న‌రికి చంపాడు. పాఠం చెబుతున్న‌ప్పుడు మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త కార్టూన్ల‌ను చూపించాడ‌ని, అందుకు ప్ర‌తీకారంగానే టీచ‌ర్‌ను హ‌త్య చేసిన‌ట్లు స‌ద‌రు యువ‌కుడు విచార‌ణ‌లో వెల్ల‌డించాడు. ఈ ఘటన నుంచి అక్కడి ప్రజలు ఇంకా తేరుకోకముందే ఈరోజు మరో ఘటన జరిగింది. దీంతో.. అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

మరోవైపు కార్టూన్లను ప్రదర్శించే హక్కు తమకు ఉందంటూ.. ఈ హత్యను ఖండిస్తూ నిర్వహించిన ర్యాలీల్లో నిరసనకారులు నినదించారు. ఫ్రాన్స్ పై ముస్లిం అతివాదులు కన్నేశారని.. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి కార్టూన్లు వస్తూనే ఉంటాయని ఫ్రాన్స్ అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. ఇది ముస్లిం సమాజంలో మరింత ఆగ్రహానికి కారణమైంది.

Next Story