రోలర్ డ్రైవర్ అవతారం ఎత్తిన ధోని.. పిచ్ను దున్నేశాడు
By Newsmeter.Network Published on 27 Feb 2020 1:33 PM GMTక్రికెట్ నుంచి విరామం తీసుకున్న ధోని.. ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటూ అభిమాలను అలరిస్తున్నాడు. అంతేకాదు.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో కలిసి హాలీడే ట్రిప్లను ఎంజాయ్ చేస్తున్నాడు. రోజుకో వేషంలో దర్శనమిస్తున్నాడు. ఇంతకముందు.. పానీపూరీ బండి దగ్గర తన మిత్రులకు పానీపురీలు అందించిన ధోనీ.. తాజాగా రోలర్ డ్రైవర్ అవతారం ఎత్తాడు. పిచ్ను చదును చేయడానికి ఉపయోగించే రోలర్ ఎక్కి పిచ్ను చదును చేశాడు.
రాంచీలోని జేఎస్సీఏ క్రికెట్ స్టేడియంలో ధోని తరచూ ప్రాక్టీస్ చేస్తుంటాడు. తాజాగా అక్కడకు వెళ్లిన ధోని.. పిచ్ రోలర్ డ్రైవర్ అవతారమెత్తాడు. పిచ్ను ఎలా చదును చేయాలో తెలుసుకున్న ధోని, తనకు అవకాశం దొరికిందే తడవుగా రోలర్ ఎక్కేసి పిచ్ను దున్నేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఎంఎస్ ధోని ఫ్యాన్స్ అఫీషియల్ ట్వీటర్ అకౌంట్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.
ఇదిలా ఉండగా.. మార్చి 2 నుంచి చిదంబరం స్టేడియంలో మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ సాధన చేయనున్నాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ధ్రువీకరించింది. సీనియర్ ప్లేయర్లు సురేశ్ రైనా, అంబటి రాయుడుతో కలిసి ప్రాక్టీస్ చేయనున్నాడు. చెన్నై సూపర్కింగ్స్ సీఈవో కేఎస్ విశ్వనాథన్ మాట్లాడుతూ.. మహేంద్రసింగ్ ధోని మార్చి2 నుంచి ఎంఏ చిదంబరం స్టేడియంలో శిక్షణ తీసుకుంటాడు. అప్పటికి అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో కలిసి సాధన చేస్తాడు. పూర్తిస్థాయి శిక్షణ శిబిరం 19 నుంచి మొదలవుతుంది. మొత్తం ఆటగాళ్లు అప్పుడు పాల్గొంటారని తెలిపాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చి 29న ప్రారంభమవుతుండగా.. మొదటి మ్యాచ్లో చైన్నై సూపర్కింగ్స్, డిఫెడింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్తో తలపడనుంది. అక్టోబర్లో జరిగే టీ20 ప్రపంచకప్లో ధోని ఉంటాడా..? అని కోచ్ రవిశాస్త్రిని ఇటీవల ప్రశ్నించగా.. ఐపీఎల్ ఫామ్ ఆధారంగానే ధోని వరల్డ్కప్ జట్టులో ఉంటాడో లేదో నిర్ణయిస్తామని సమాధానమిచ్చాడు. ధోని సన్నిహితులు కూడా.. ఐపీఎల్లో ధోని రాణిస్తేనే అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగే అవకాశం ఉందని చెప్పడంతో ఇప్పుడు అందరి దృష్టి ధోనిపై పడింది. ఐపీఎల్లో ధోని ఎలా ఆడతాడో నని అందరు ఎదురుచూస్తున్నారు.