బాంబు పేలుడు.. 76 మంది మృతి..100 మందికి గాయాలు
By సుభాష్ Published on 28 Dec 2019 11:28 AM GMT
ఓ కారు బాంబు పేలడంతో 76 మంది వరకు మృతి చెందారు. సోమాలియాలో చోటు చేసుకున్న ఈ ఘటన అందరిని భయభ్రాంతులకు గురి చేసింది. రద్దీగా ఉండే మొగదిషు ప్రాంతంలో తనిఖీ కేంద్రం వద్ద ఓ కారును నిలిపి ఉంచారు. కొద్దిసేపటి తర్వాత ఆ కారులో బాంబు పేలడంతో దాదాపు 76 మంది వరకు మృతి చెందారు. కాగా, సూసైడ్ బాంబర్గా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో చాలా మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు వందమంది క్షతగాత్రులను చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అల్-ఖైదాతో అనుబంధంగా ఉన్న అల్-షాబాబ్ ఇస్లామిస్ట్ ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
గతంలో అల్ షబాబ్ మిలిటెంట్ల ఈ తరహాలోనే దాడులకు తెగబడ్డ విషయం తెలిసిందే. మృతి చెందిన వారిలో అధిక శాతం విద్యార్థులున్నట్లు అధికారులు వెల్లడించారు. కారు బాంబు పేలిన సమయంలో విద్యార్థులతో ఓ బస్సు వెళ్లిందని, అందుకే అధిక శాతం విద్యార్థులే చనిపోయారని పోలీసుల అధికారులు పేర్కొంటున్నారు. కాగా, మొగాడిషులో 2017 అక్టోబర్లో ట్రక్ బాంబు దాడిలో 512 మంది మృతి చెందగా, 295 మంది తీవ్రంగా గాయపడ్డారు. అప్పుడు జరిగిన ఘటన దేశ చరిత్రలో అత్యంత ఘోరమైనదిగా అధికారులు పేర్కొన్నారు.