వలస కూలీల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాం: మంత్రి కిషన్రెడ్డి
By సుభాష్ Published on 2 May 2020 12:36 PM GMTదేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్డౌన్ కొనసాగుతోంది. ఈ లాక్డౌన్ కారణంగా వలస కూలీలు, కార్మికులు, విద్యార్థులు, ఇతరులు వివిధ రాష్ట్రాల్లో చిక్కకున్నవారిని సొంతూళ్లకు తరలించేందుకు కేంద్రం అంగీకరించింది. లాక్డౌన్ కారణంగా వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వివిధ రాష్ట్రాల కోరిక మేరకు కేంద్రం అంగీకరించి వారిని తరలించేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వలస కూలీలు, కార్మికులు, విద్యార్థుల కోసం శనివారం నుంచి 300లకుపైగా రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు. శుక్రవారం నాడు ఆరు రైళ్లను నడిపామని అన్నారు. కొత్తగా పాజిటివ్ కేసులు వస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. లాక్డౌన్లో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా కొన్ని వెలుసుబాట్లు కలిగేలా విధి విధానాలు రూపొందించామని వెల్లడించారు.
ఇక దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు పెరిగిపోతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో లాక్డౌన్ను మే 17 వరకూ పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. కరోనా కేసుల సంఖ్యలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను అరికట్టేందుకు ఎన్నో చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం దేశంలో మూడో దశ లాక్డౌన్ కొనసాగుతోంది. జనాలు బయటకెవ్వరు రాకుండా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. లాక్డౌన్ కారణంగా ఎంతో మంది ఉపాధి లేక నానా అవస్థలు పడుతున్నారు.