మీడియా సంస్థల్లో కరోనా ముందస్తు చర్యలు..
By అంజి Published on 16 March 2020 7:43 AM GMTహైదరాబాద్: భారత్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. మీడియా సంస్థల్లో ముందస్తు చర్యలు చేపట్టారు. తమ ఉద్యోగులకు కరోనా సోకకుండా ఉండేందుకు మీడియా సంస్థలు తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టర్లకు ఇవాళ్టి నుంచి వర్క్ ఫ్రమ్ హోంకు అనుమతి ఇచ్చింది. రిపోర్టర్లు, మార్కెటింగ్ ఉద్యోగులు, ఫీల్డ్లో తిరిగే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ వెసులు బాటు కల్పించింది. హైదరాబాద్తో పాటు ఢిల్లీ, ముంబై నగరాల్లోని ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేయాలని చెప్పింది. వివిధ చోట్ల తిరిగే రిపోర్టర్లు, మార్కెటింగ్ సిబ్బంది.. కరోనా ట్రాన్స్మిటర్లుగా మారే ప్రమాదం ఉన్న నేపథ్యంలో మీడియా సంస్థలు నిర్ణయాన్ని తీసుకున్నాయి.
టైమ్స్ ఆఫ్ ఇండియా బాటలోనే న్యూస్-18 కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు, సంస్థలు కూడా ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించాయి. దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య ఇప్పటికే 100కుపైగా చేరుకుంది. ఉద్యోగులు రోజు ఇంటి నుంచి ఆఫీసుల్లో, కార్యాలయాలకు రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బస్సులోనే, మెట్రోలోనే ప్రయాణించే సందర్భంలో వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక న్యూస్ రిపోర్టర్లు.. వార్తలకు సంబంధించి అన్ని చోట్ల తిరుగుతుంటారు. ఈ క్రమంలో వారికి కరోనా సోకే అవకాశాలు లేక పోలేదు. ఈ నేపథ్యంలో పలు మీడియా సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించాయి.
ఇక తెలంగాణలో మూడో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. నెదర్లాండ్స్ నుంచి ఇటీవలే వచ్చిన రంగారెడ్డి జిల్లా వాసికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని పుణె వైరాలజీ ల్యాబ్ నిపుణులు తెలిపారు.