ఆనాటి ఉద్యమానికే నేడు గుర్తింపు

By సుభాష్  Published on  1 May 2020 12:28 AM GMT
ఆనాటి ఉద్యమానికే నేడు గుర్తింపు

ప్రపంచ కార్మిక ఉద్యమానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం మే 1న కార్మిక దినోత్సవం జరుపుకొంటారు. 1886 మే 4న చికాగో నగరంలో 8 గంటల పనిదినం కోసం సమ్మె చేస్తుండగా, పోలీసుల కాల్పుల్లో నలుగురు కార్మికులు మృతి చెందారు. 1904లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్టు సభల్లో 8 గంటల పనిదినం కోసం మే 1న పని నిలిపివేసి నిరసన ప్రదర్శనలు జరపాలని తీర్మానించారు. అలా వివిధ దేశాల్లో మే1న కార్మికులు తమ సమస్యలపై స్పందిస్తూ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. మన దేశంలో మేడే సంబరాలు చెన్నై నగరంలో 1923లో జరిగాయి. లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందూస్తాన్ ఆధ్వర్యంలో 1923, మే1న సింగరవేలు చెట్టియార్ నాయకత్వంలో దేశంలోనే తొలిసారి ఎర్రజెండా ఎగురవేశారు.

ప్రపంచాన్ని బతికించడానికి సూర్య చంద్రులు కార్మికుల్లా పనిచేస్తుంటే, ప్రపంచాన్ని నడిపించడానికి కోట్లాదిమంది కార్మికులు సూర్యచంద్రుల్లా పగలూ రాత్రి కష్టపడుతున్నారు. ఆ కష్టానికి ఫలితాన్ని ఆశించడం ప్రతి ఒక్కరి హక్కు. ఒకప్పుడు మాత్రం అది నేరం. ఎవరైనా ప్రశ్నిస్తే విప్లవకారుడన్న ముద్ర వేసి జైల్లో తోసేవారు. 19వ శతాబ్దం చివరి వరకూ పరిస్థితులు అలానే కొనసాగాయి.

ఆరోగ్యాన్నీ, వ్యక్తిగత జీవితాన్నీ పణంగా పెట్టి రోజుకు పన్నెండు గంటలకు పైగా కార్మికులు పని చేసేవారు. దశాబ్దాల తరబడి అదే విధానానికి అలవాటు పడ్డ శ్రామికులు కమ్యూనిస్టు, సోషలిస్టు పార్టీల అండతో మొదట రష్యాలో ‘ఎనిమిది గంటలు పని’ నినాదాన్ని అందుకున్నారు. అది ఇతర దేశాలకూ పాకింది.

చికాగోలో కార్మికులు మే నెల మొదట్లో యాజమాన్యాలకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. అప్పుడు జరిగిన గొడవల్లో కొందరు కార్మికులు చనిపోయారు. వారిని స్మరిస్తూ మరుసటి రోజు ఇంకొందరు కవాతు నిర్వహించారు.

ఆ సమయంలో ఎవరో ఆగంతకుడు డైనమైట్‌ విసరడంతో కొందరు పోలీసులూ, సామాన్యులూ ప్రాణాలు కోల్పోయారు. ఆ వార్త ప్రపంచవ్యాప్తంగా కార్మిక సంఘాలకు ఆగ్రహం తెప్పించింది. పోరాటాలు ఉద్ధృతమయ్యాయి. ప్రభుత్వాలు దిగొచ్చాయి.

పనివేళలను కుదిస్తూ అమెరికా చట్టాన్ని తీసుకొచ్చింది. తర్వాత మరికొన్ని దేశాలూ అదే బాట పట్టాయి. మేలో జరిగిన చికాగో దుర్ఘటన గొడ్డు చాకిరీ నుంచి విముక్తికి పునాది వేసింది కాబట్టి, మే 1ని ‘ప్రపంచ కార్మిక దినోత్సవం’గా జరుపుకోవాలనీ, ఆ రోజు శ్రామికులంతా పనికి విరామమిచ్చి వీధుల్లోకి వచ్చి తమ గొంతు వినిపించాలని ప్యారిస్‌లో జరిగిన సోషలిస్టు లేబర్‌ పార్టీల ‘సెకండ్‌ ఇంటర్నేషనల్‌’ సమావేశం నిర్ణయించింది.

అదే భారత్‌ సహా అనేక దేశాల్లో ‘మే డే’గా మారింది. చాలా దేశాల్లో ప్రజా ఉద్యమాలకు అదే రోజు శ్రీకారం చుడతారు. ఏదేమైనా కార్మికుల శ్రమను గౌరవించినందుకు జరుపుకొనే వేడుకే మేడే. అది నేడే.

Next Story