తండ్రి మృతదేహాన్ని చూసేందుకు వెళ్లిన అమృత.. అడ్డుకున్న బంధువులు
By Newsmeter.Network Published on 9 March 2020 12:19 PM IST
హైదరాబాద్లో ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన మారుతీరావు అత్యక్రియలు సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడెలో జరిగాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు భారీ సంఖ్యలో తరలిరాగా అంతిమయాత్ర నిర్వహించారు. అంతిమ యాత్రలో స్థానిక ఎమ్మెల్యే భాస్కర్రావు, మున్సిపల్ చైర్మన్ భార్గవ్లు పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే తన తండ్రి మృతదేహాన్ని చూసేందుకు తనకు భద్రత కల్పించాలని అమృత పోలీసులను కోరింది. కానీ అందుకు ఆమె తల్లి, బాబాయ్లు నిరాకరించారని వార్తలు వచ్చాయి. అవన్నీ వాస్తవాలు కావని, అంత్యక్రియలకు రావొద్దని అమృతకు తాము చెప్పలేదని మారుతీరావు సోదరుడు శ్రవణ్ తెలిపారు. ఈనేపథ్యంలో అమృత, ఆమె భర్త కుటుంబ సభ్యులు పోలీసుల రక్షణ నడుమ పోలీస్ వాహనంలో మారుతీరావు అత్యక్రియలు నిర్వహించే హిందూ స్మశానం వద్దకు బయలుదేరి వెళ్లారు. దీంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.
కాగా అమృత రావటాన్ని గమనించిన బంధువులు ఆమెను వెనక్కు వెళ్లాలని నినాదాలు చేశారు. అమృత గోబ్యాక్.. గ్యోబ్యాక్ అంటూ గట్టిగా కేకలు వేశారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉధ్రికత్తంగా మారింది. ఉధ్రిక్తత పరిస్థితుల నడుమే అమృత తండ్రి మృతదేహాన్ని కొంచెం దూరంనుంచే కడసారి చూసి వెనుదిరిగింది. అమృత వచ్చిన సమయంలో మారుతీరావు బంధువులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. దుర్భాషలాడుతూ.. ఎందుకొచ్చావంటూ నిలదీశారు.