తడబడి.. నిలబడి.. కివీస్‌ లక్ష్యం ఎంతంటే..

By Newsmeter.Network  Published on  31 Jan 2020 8:54 AM GMT
తడబడి.. నిలబడి.. కివీస్‌ లక్ష్యం ఎంతంటే..

వెల్లింగ్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌ తో జరుగుతున్న నాలుగవ టీ20లో టీమిండియా తడబడి నిలబడింది. కివీస్‌ బౌలర్ల ధాటికి టీమిండియా టాప్‌ ఆర్డర్‌ చేతులెత్తయగా.. మనీష్ పాండే అర్థశతకంతో రాణించడంతో నిర్ణీత 20ఓవర్లలో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.

టాస్‌ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మకు విశ్రాంతినివ్వడంతో సంజు శాంసన్‌ తో కలిసి కెఎల్ రాహుల్ (39; 26 బంతుల్లో 3పోర్లు, 2సిక్సర్లు) బ్యాటింగ్‌ ను ఆరంభించారు. రాకరాక అవకాశం వస్తే.. సంజు మరోసారి నిరాశ పరిచాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజు కేవలం 5 బంతులు మాత్రమే ఆడి 8 పరుగులు చేసి తొలి వికెట్‌ గా ఔటయ్యాడు. కుగ్‌లీన్ వేసిన రెండో ఓవర్‌ మొదటి బంతిని సిక్స్‌ కొట్టిన శాంసన్‌.. రెండో బంతికి పరుగు తీయలేదు. ఇక మూడో బంతికి భారీ షాట్‌ కొట్టే యత్నంలో సాన్‌ట్నార్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

వన్‌ డౌన్‌ లో వచ్చిన పరుగులయంత్రం, కెప్టెన్‌ కోహ్లీ (11; 9 బంతుల్లో 2పోర్లు) బెన్నెట్ బౌలింగ్‌ లో సాన్‌ట్నర్‌ పట్టిన అద్భుత క్యాచ్‌ కు పెవిలియన్‌ చేరాడు. శ్రేయాస్‌ అయ్యర్ (1; 7 బంతుల్లో) శివమ్‌ దూబే (12; 9 బంతుల్లో 2 పోర్లు) వెంటవెంటనే ఔట్ కావడంతో టీమిండియా 88 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో మిడిల్ ఆర్డర్‌ బ్యాట్ మెన్‌ మనీష్ పాండే (50; 36 బంతుల్లో 3పోర్లు) తో జతకలిసిన శార్దుల్ ఠాకూర్‌ (20; 15బంతుల్లో 2పోర్లు) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. వీరిద్దరు ఏడో వికెట్ కు 47 పరుగులు జోడించారు. చివర్లో నవదీప్‌ సైనీ (11; 9బంతుల్లో 2పోర్లు) ధాటిగా బ్యాటింగ్‌ చేయడంతో టీమిండియా నిర్ణీత 20ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసి.. కివీస్ ముందు 166 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కివీస్‌ బౌలర్లలో సోథీ 3వికెట్లు, బెన్నెట్ 2 వికెట్లు సాధించగా..సౌధీ, సాన్‌ట్నర్‌, కుగ్‌లీన్ తలా ఓ వికెట్ పడగొట్టారు.

Next Story