అనంత‌పురం జిల్లాలో దారుణం...ఆస్తి కోసం త‌మ్ముడినే హ‌త్య చేసిన అన్న‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Nov 2019 10:49 AM GMT
అనంత‌పురం జిల్లాలో దారుణం...ఆస్తి కోసం త‌మ్ముడినే హ‌త్య చేసిన అన్న‌

మాన‌వ‌త్వం మంట‌గ‌లుస్తోంది. ఆస్తి త‌గాదాలే కుటుంబాల్లో చిచ్చురేపుతున్నాయి. సొంత అన్న‌ద‌మ్ముల మ‌ధ్య గొడ‌వ‌లే దారుణానికి ఒడిగ‌డుతున్నాయి. సొంత త‌మ్ముడినే అన్న దారుణంగా న‌రికి చంపేశాడు. ఈ దారుణ ఘ‌ట‌న‌ జిల్లాలోని పుట్లూరు మండలం శనగల గూడూరులో చోటు చేసుకుంది. ఈ హ‌త్య ఆస్తి త‌గాదాల వ‌ల్లే జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. త‌మ్మ‌డి త‌ల, మొండెం వేరు చేసి అతి కిరాత‌కంగా హ‌త‌మార్చి, అనంత‌రం అన్న అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు. సొంత త‌మ్ముడినే అన్న హ‌త్యం చేయ‌డం ఇప్పుడు జిల్లాలో సంచ‌ల‌నంగా మారింది. వివ‌రాల్లోకి వెళితే...శనగల గూడూరుకు చెందిన రామాంజనేయులు, రాజ కుల్లాయప్ప అన్నదమ్ములు. కాగా, కొద్దికాలంగా వారిద్దరి మధ్య ఆస్తి తగాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఆస్తి వివాదం చిలికి చిలికి తమ్ముడి హత్యకు దారితీన‌ట్లు తెలుస్తోంది. గ‌త కొద్ది రోజులుగా ఆస్తి విష‌యంలో త‌గాదాలు చోటు చేసుకుంటుండ‌గా, తమ్ముడు రాజ కుల్లాయప్ప (40)ను ఎలాగైనా హ‌త్య చేయాల‌ని నిర్ణ‌యించుకున్న అన్న‌ రామాంజనేయులు ...తమ్ముడు కుల్లాయప్పను దారుణంగా అంత‌మొందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివ‌రాలు సేక‌రించారు. ఆస్తి కోసమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

Next Story