భూమి బల్లపరుపుగా ఉందని నిరూపిస్తానని.. రాకెట్ టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే

By అంజి  Published on  25 Feb 2020 5:41 AM GMT
భూమి బల్లపరుపుగా ఉందని నిరూపిస్తానని.. రాకెట్ టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే

అమెరికా: భూమి బల్లపరుపుగా ఉందని నమ్మి, భూమి గుండ్రంగా లేదని నిరూపిస్తానని చేసిన ఓ రాకెట్‌ ప్రయోగంలో అమెరికన్‌ పైలట్‌ తన ప్రాణాలు కోల్పోయాడు. మ్యాడ్‌ మైక్‌ హ్యూజ్‌ (64) ఈ నెల 22న రాకెట్‌ ప్రమాదంలో మరణించారు. హ్యూజ్‌ సొంతంగా తయారు చేసుకున్న రాకెట్‌ను బార్‌స్టో నగరానికి దగ్గర్లో కాలిఫోర్నియా ఎడారి ప్రాంతంలో ప్రయోగం చేపట్టారు. భూమి గుండ్రంగా లేదని నిరూపించేందుకు హ్యూజ్‌ ఈ ప్రయోగం చేపట్టారు. అయితే రాకెట్‌ పైకి వెళ్లిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో హ్యూజ్‌ చనిపోయాడు.

రాకెట్‌ గాల్లోకి ఎగిరిన తర్వాత కుప్ప కూలిన దృశ్యం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఉంది. దాదాపు 1,500 మీటర్ల ఎత్తుకు వెళ్లాలన్నది తన కోరిక అని హ్యూజ్‌ ఒక సందర్భంలో చెప్పారు. భూమి గుండ్రంగా లేదని అక్కడికి వెళ్లి నిరూపిస్తానన్న హ్యూజ్‌.. కిందకి దిగకుండా గాల్లోనే ప్రాణాలను వదిలాడు. ఈ ప్రమాదానికి ప్రదాన కారణం.. రాకెట్‌ ఎగిరినప్పుడు పారాచ్యూట్‌ చాలా ముందుగానే తెరుచుకుంది. హ్యూజ్‌ తన పార్ట్‌నర్‌ వాల్డో స్టేక్స్‌ సాయంతో ఈ రాకెట్‌ను ఐదు వేల అడుగుల ఎత్తుకు చేరుకొనేందుకు ప్రయత్నించారని స్పేస్‌.కామ్‌.. బీబీసీకి తెలిపింది. యూఎస్‌ సైన్స్‌ చానల్‌లో ప్రసారం కానున్న కొత్త టీవీ సిరీస్‌ 'హోమ్‌మేడ్‌ అస్ట్రోనాట్స్‌'లో భాగంగా ఔత్సాహిక రాకెట్‌ తయారీదారులపై చేసిన ఈ ప్రయోగాన్ని చిత్రీకరించారు.



పరిమితమైన బడ్జెట్‌తో చేపట్టిన ఈ ప్రాజెక్టులో.. హ్యూజ్‌ తన కలను సాకారం చేసుకునే ప్రయత్నంలో చనిపోయాడని సైన్స్‌ చానల్‌ తన ట్విటర్‌లో పేర్కొంది. రాకెట్‌ ప్రయోగ కార్యక్రమానికి తమ అధికారులను, నిర్వహకులను పిలిచారని శాన్‌ బెర్నార్డినో కౌంటీ షెరీఫ్‌ కార్యాలయం బీబీసీకి తెలిపింది. సుమారు 18 వేల డాలర్లు ఖర్చు చేసి.. హ్యూజ్‌, ఆయన అసిస్టెంట్లు ఈ రాకెట్‌ను తయారు చేశారు. ఒక నాజిల్‌ గుండా వెలువడే ఆవిరితో ఈ రాకెట్‌ ముందుకు సాగుతుంది. భూమి బల్లపరుపుగా ఉందని హ్యూజ్‌ ప్రకటించినప్పుడు.. అతడు ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించారు. తాను భూమి ఏ విధంగా ఉందో నిరూపిస్తానని.. 2018లో చెప్పారు.



Next Story