సుబ్రహ్మణ్య షష్టి విశిష్టత!

By Newsmeter.Network  Published on  2 Dec 2019 8:57 AM GMT
సుబ్రహ్మణ్య షష్టి విశిష్టత!

జన జీవనంలో పలు రకాలుగా ప్రచారంలో ఉండి భక్తుల పాలిట కల్పవల్లిగా ఈ పర్వదినం అలరారుతుంది. తెలుగునాట ఈ పండుగ వల్లనే సుబ్బమ్మ, సుబ్బారాయుడు, సుబ్బి, సుబ్బారావు, సుబ్రహ్మణ్యం, బాల సుబ్రహ్మణ్యం లాంటి పేర్లు విస్తృతంగా పెట్టుకోవటం జరుగుతోంది. శివుడి రెండో కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామిని ఈరోజు ఆరాధిస్తారు. తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుడు అంశతో మార్గశిర శుద్దషష్టి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు. అయితే ఈ మార్గశిర షష్టినే సుబ్రహ్మణ్య షష్టి లేదా స్కంద షష్టిగా అని కూడా పిలుస్తుంటారు. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివుని అనుగ్రహం కోసం తీవ్రంగా తపస్సు చేసి బాలునితో తప్ప ఇతరులతో చావు లేని వరం పొందాడు.

దీంతో తాను అజేయుడునని, అమరుడునని వరగర్వంతో ముల్లోకాలను గజగజలాడించగా దేవతలు విష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటారు. వరమిచ్చిన ఆ పరమశివుని పుత్రుని వల్లే తారకాసురుని మరణం సంభవిస్తుందని శ్రీహరి తెలిపి ఆదిదేవునివద్దకు వెళ్లి సమస్యను విన్నవించుకోమని సెలవిచ్చారు. అంతట దేవతలు పరమశివుని వేడుకోవడంతో సమస్య తీవ్రతను గ్రహించి తన అంశతో సుబ్రహ్మణ్య స్వామి జన్మకు కారకులయ్యారు.

అయితే …పురాణగాథల ప్రకారం.. పరమశివుని దివ్యతేజస్సు వాయుదేవునిలో ప్రవేశింపబడి తిరిగి వాయుదేవుడు అగ్నిలో ప్రవేశింపజేశాడు. అగ్ని కూడా శివతేజస్సును తాళలేక గంగానదిలో విడిచిపెట్టగా రుద్రతేజం ప్రవాహంలో వెళ్లి వనంలో చిక్కుకొని ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఓ బాలుడు జన్మించాడు. అతడే సుబ్రహ్మణ్యస్వామి లేదా కుమార స్వామి. కుమారస్వామిని దేవతలు తమ సేనాధిపతిని చేశారు. కుమారస్వామి తారకాసురుడితో ఆరు రోజుల పాటు భీకర యుద్ధం చేసి వధించాడు. లోకాన్ని, దేవతలను కాపాడి అందరి మన్ననలు పొందిన సుబ్రహ్మణ్యస్వామి దేవసేనాపతిగా కీర్తింపబడ్డారు.

సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తులు తెల్లవారే లేచి తలంటు స్నానమాచరించి పాలు, పంచాదారలతో నిండిన కావిడలను ధరించి సుబ్రహ్మణ్య స్వామికి సమర్పిస్తారు. దేవాలయాలను దర్శించి భక్తిశ్రద్ధలతో అష్టోత్తర శతనామాల పూజలు చేస్తారు. భక్తులు కావడిలతో తెచ్చిన పంచదార, పాలను స్వామికి సమర్పించుకుంటారు. అయితే ఈ కావడిలోని వస్తువులు భక్తుల మొక్కుల బట్టి ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆచారం తమిళనాడులో విశేషంగా ఆచరణలో ఉన్నది.

స్కంద షష్టి నాడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం నిర్వహిస్తారు. అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి.. అంతేకాదు సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. విశిష్టమైన ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసినా, కావడి సమర్ఫించినా సత్సంతాన ప్రాప్తి. రాబోయే తరాలవారికి కూడా సంతాన లేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకం. అందుకే సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు ఎక్కువగా మహిళలు సందర్శిస్తుంటారు. ఈ రోజు పుట్టలో పాలు పోస్తే సర్పదోషాలు తొలగిపోతాయని నమ్మకం. స్కంద షష్ఠి నాడు సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం జరిపించే భక్తులకు సకలశుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.

Next Story