లాక్‌డౌన్‌4.0పై కేంద్రం సంచలన నిర్ణయం

By సుభాష్  Published on  17 May 2020 1:11 PM GMT
లాక్‌డౌన్‌4.0పై కేంద్రం సంచలన నిర్ణయం

దేశంలో కరోనా కేసుల సంఖ్య తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌పై సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 31 వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే లాక్‌డౌన్‌కు సంబంధించి మార్గదర్శకాలను రాత్రి వరకూ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. నాలుగో విడత లాక్‌డౌన్‌ నేపథ్యంలో పలు రాష్ట్రాలకు భారీగానే సడలింపులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో సడలింపులు భారీగానే ఉంటాయని తెలుస్తోంది.

అయితే నాలుగో దశ లాక్‌డౌన్‌లో ఎలాంటి మార్గదర్శకాలు ఇస్తుందనేది ఉత్కంఠ నెలకొంది. ఇక లాక్‌డౌన్‌ మార్గదర్శకాలపై రాష్ట్రాల సీఎస్‌లు,డీజీపీలు, ప్రిన్సిపల్‌ సెక్రటరీలు, హోంశాఖ కార్యదర్శులతో కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. కాగా, రాత్రి 9 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నాలుగో విడత లాక్‌డౌన్‌పై సంప్రదింపులు జరిపనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత లాక్‌డౌన్‌ 4.0పై మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక దేశ వ్యాప్తంగా కోవిడ్‌-19ను అరికట్టేందుకు భారత్‌లో మార్చి 25వ తేదీ నుంచి తొలి విడత లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటి సారిగా ఏప్రిల్‌ 15 వరకూ, తర్వాత రెండోసారిగా మే 4వ తేదీ వరకూ, మూడో దశగా మళ్లీ మే 17 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. తాజాగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు అదుపులోకి రాకపోవడంతో మరోసారి లాక్‌డౌన్‌ మే 31వ తేదీ వరకూ పొడిగించింది. అయితే ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని నాలుగో దశ లాక్‌డౌన్‌లో మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఏపీలో మాత్రం కరోనా విజృంభిస్తుండగా, తెలంగాణలో తగ్గుముఖం పట్టి.. మళ్లీ విజృంభిస్తోంది. నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్క హైదరాబాద్‌లోనే నమోదవుతుండటం గమనార్హం.

Lockdown

Next Story