'లోకల్ రిపోర్టర్' యాప్ అద్భుతం

By రాణి  Published on  26 Feb 2020 7:44 AM GMT
లోకల్ రిపోర్టర్ యాప్ అద్భుతం

  • తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ

జర్నలిజంలో మూడో తరంగా వచ్చిన డిజిటల్ మీడియా ఇప్పుడు వార్తా ప్రపంచాన్ని శాసిస్తోందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్లు లేకుండా వార్తా ప్రపంచమే లేదని, కంటెంట్ ఉంటే డిజిటల్ మీడియాలో సాంకేతికతను ఉపయోగించుకుని జర్నలిస్టులు తమ వృత్తిలో రాణించవచ్చన్నారు. పబ్లిక్ వైబ్ న్యూస్ యాప్ తాజాగా రూపొందించిన లోకల్ రిపోర్టర్ యాప్ ను అల్లం నారాయణ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..లోకల్ రిపోర్టర్ యాప్ సహాయంతో రిపోర్టర్లు తమ స్మార్ట్ ఫోన్ల ద్వారానే తాజా వార్తలను అందించవచ్చని తెలిపారు. ఈ యాప్ ను వాడటం వల్ల రిపోర్టర్లు తమ వృత్తితో స్వతంత్రంగా ఎదిగేందుకు అవకాశముంటుందన్నారు.

రచన జర్నలిజం కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. లోకల్ రిపోర్టర్ యాప్ జర్నలిజంలో ఒక అద్భుతావిష్కరణ అని కొనియాడారు. ఎలక్ట్రానిక్ మీడియా ఎదుర్కొంటున్న అన్ని సాంకేతిక సమస్యలకు ఇది శాశ్వత పరిష్కారం చూపిస్తుందన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ ద్వారా ఈ యాప్ వాడే విధానంపై రిపోర్టర్లకు శిక్షణ ఇస్తే బాగుంటుందని సూచించారు.

పబ్లిక్ వైబ్ ఫౌండర్, సీఈఓ వి. నరసింహా రెడ్డి మాట్లాడుతూ.. ఘటన జరిగిన ప్రాంతం నుంచి నిమిషాల వ్యవధిలోనే ఆ వార్తను ప్రజలకు తెలియజేసేందుకు లోకల్ రిపోర్టర్ యాప్ ఉపయోగపడుతుందన్నారు. విజువల్స్ రికార్డ్ చేసిన స్మార్ట్ ఫోన్ ద్వారానే సులువుగా వాటిని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్, గ్రాఫిక్ ప్లేట్స్ యాడ్ చేసి నిమిషాల్లోనే ఈ లోకల్ రిపోర్టర్ యాప్ వార్తలుగా మలుస్తుందని నరసింహారెడ్డి వెల్లడించారు. ''public vibe'' India's #1LocalNewsPlatform లో పోస్టు చేసినట్లైతే నిమిషాల్లోనే లక్షల మంది చేరుతుందన్నారు. వీడియో ఎడిట్ సూట్ లాంటి ఎక్విప్ మెంట్స్, వీడియో ఎడిటర్స్, గ్రాఫిక్ డిజైనర్ల అవసరం లేకుండా, అసలే మాత్రం ఖర్చు లేకుండా అత్యంత సులువుగా, అత్యంత తక్కువ టైమ్ లోనే చేతిలోని స్మార్ట్ ఫోన్ ద్వారా టెలికాస్ట్ చేసే క్వాలిటీతో న్యూస్ ప్యాకేజీలను రూపొందించే ఈ Local Reporter యాప్ ఇపుడు డిజిటల్ మీడియాలో సరికొత్త విప్లవానికి నాంది పలికిందనీ ఆయన తెలిపారు.

Next Story