లేడీ డాక్టర్ ఆత్మశాంతికై సాఫ్ట్వేర్ ఇంజినీర్ల క్యాండిల్ ర్యాలీ
By న్యూస్మీటర్ తెలుగు Published on 30 Nov 2019 3:02 PM GMTహైదరాబాద్ : వెటర్నరీ డాక్టర్ హత్యకేసు ఉదంతంలో నిబంధనలు పక్కనపెట్టి దోషులను కఠినంగా శిక్షించాలని సాఫ్ట్వేర్ ఉద్యోగులు కోరారు. ఆమె ఆత్మశాంతి చేకూరాలని హైదరాబాద్ ఐటీ కారిడార్లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు క్యాండిల్ ర్యాలీ చేపట్టారు.
వరంగల్లో యాసిడ్ దాడి జరిగిన సమయంలో పోలీస్ ఉన్నతాధికారిగా ఉన్న సజ్జనార్ ఇప్పుడు సైతం అదే రీతిలో తగు చర్యలు తీసుకొని.. ఇలాంటి మానవ మృగాలకు తగిన శిక్ష విధించాలని కోరారు. మృతురాలి హత్యకు కారణమైన నిందితులను క్షమించవద్దని వారు స్పష్టం చేశారు.
ఐటీ కారిడర్లో కూడా పలు సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయని ఆయా చోట్ల సీసీ కెమెరాలు వంటి భద్రతా ఏర్పాట్లను పునఃపరిశీలించాలని ఈ సందర్భంగా టెకీలు కోరారు. పోలీసులు రక్షణ కోసం అందిస్తున్న నంబర్లను సాఫ్ట్వేర్ ఇంజినీర్లతో పాటు మహిళలంతా సేవ్ చేసుకోవాలని, ఆపదలో వారిని సంప్రదించాలని ఈ సందర్భంగా కోరారు. ఐటీ ఉద్యోగులు వివిధ సాంకేతిక అవకాశాలను ఉపయోగించుకోవాలని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాల కోరారు.