ఏపీలో తొలి పైలెట్‌ శిక్షణ కేంద్రం.. అందుబాటులోకి రానున్న కర్నూలు ఎయిర్‌పోర్టు

By సుభాష్  Published on  9 Oct 2020 8:13 AM GMT
ఏపీలో తొలి పైలెట్‌ శిక్షణ కేంద్రం.. అందుబాటులోకి రానున్న కర్నూలు ఎయిర్‌పోర్టు

ఏపీలో తొలి పైలెట్‌ శిక్షణ కేంద్రం కర్నూలులో ఏర్పాటు కానుంది. ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైదరాబాద్‌, బెంగళూరు ఎయిర్‌పోర్టులకు దగ్గర ఉండటం, అలాగే కర్నూలు ఎయిర్‌ పోర్టు అందుబాటులోకి రానుండటంతో ఇక్కడ పైలెట్‌ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వ ఏవియేషన్‌ సలహాదారు, ఏపీ ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీ భరత్‌రెడ్డి తెలిపారు.

కాగా, ఈ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు మూడు సంస్థలు ముందుకొచ్చినట్లు వారు తెలిపారు. త్వరలో ఈ కేంద్రానికి సంబంధించి ఫైనాన్షియల్‌ బిడ్లు పిలవనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ కేంద్రానికి సంబంధించిన మౌలిక వసతులను ఆ సంస్థే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని, కర్నూలు ఎయిర్‌పోర్టు ల్యాండ్‌ను వినియోగించుకున్నందుకు ఏపీఏడీసీఎల్‌కు అద్దె చెల్లించాల్సి ఉంటుందన్నారు.

అనుమతులు వస్తే విజయదశమికి అందుబాటులో..

ఈ విమానాశ్రయానికి కేంద్ర పౌర విమానయాన సంస్థ నుంచి అనుమతులు వస్తే కర్నూలు ఎయిర్‌పోర్టును విజయదశమికి అందుబాటుటులోకి తీసుకువస్తామని అన్నారు. కర్నూలు నుంచి ఉడాన్‌ పథకం కింద చౌక విమాన సర్వీసులు నడపడానికి ట్రూజెట్‌ మూడు రూట్లు దక్కించుకుంది. కర్నూ నుంచి విజయవాడ, విశాఖ, బెంగళూరు నగరాలకు ఈ సర్వీసులు నడపనుంది. సుమారు 970 ఎకరాల్లో రూ.160 కోట్లతో ఏపీఏడీసీఎల్‌ కర్నూలు ఎయిర్‌పోర్టును నిర్మించింది. 2 వేల మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పుతో రన్‌వేను అభివృద్ధి చేసింది. అయితే ప్రస్తుతం పగటి పూట మాత్రమే విమానాలు నడుపుతారు. రెండో దశలో రాత్రి వేళల్లో సర్వీసులను ప్రారంభించనున్నారు.

Next Story