ట్రోలింగ్ బారిన పడ్డ కిరణ్ బేడీ..!

By Newsmeter.Network  Published on  5 Jan 2020 2:34 AM GMT
ట్రోలింగ్ బారిన పడ్డ కిరణ్ బేడీ..!

సోషల్‌ మీడియాలో మంచి కంటే చెడు, నిజాలకంటే అబద్ధాలే వైరల్ అవుతాయి అన్న మాట అతిశయోక్తి కాదు. ఇక వాట్సాప్‌లో చాలామంది తమకు వచ్చిన మెసెజ్‌లలో ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది పాతదో ఏది కొత్తదో తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే మరొకరికి ఫార్వార్డ్‌ చేస్తున్నారు. దాంతో మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతోంది. కొందరు ప్రముఖులు సైతం స్ఫూర్తిమంతమైన వార్తల్ని ప్రచారం చేస్తుండగా.. కొందరు మాత్రం అనాలోచితంగా మెసేజ్‌లు ఫార్వార్డ్‌ చేసి నెటిజన్ల దగ్గర బుక్కయిపోయారు. తాజాగా పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌, మాజీ ఐపీఎస్‌ అధికారిణి కిరణ్‌బేడీ ఆ జాబితాలో చేరారు. ఎన్నో నెలలుగా వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న ఓ అసత్య వార్తను ఆమె ట్విటర్‌లో పోస్టు చేసి ట్రోలింగ్‌​ బారిన పడ్డారు.

ఆమె ఓ వీడియోను పోస్టు చేసి.. ‘సూర్యుడి నుంచి వస్తున్న ఓంకార శబ్దాన్ని నాసా రికార్డు చేసింది’ అని క్యాప్షన్‌ కూడా ఇచ్చారు. దీంతో నెటిజన్లు ఆమెను ట్రోలింగ్‌ చేయడం మొదలు పెట్టారు. నాసా గతంలో విడుదల చేసిన అసలు వీడియోను పోస్టు చేసి.. వాస్తవాలు తెలుసుకోండి మేడం..! అని కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఒరిజినల్ వీడియో లో ఓం ఉండదు. ఇంకొందరు మీరు కోయి మిల్ గాయా సినిమా చూడలేదా అని ప్రశ్నించారు. ఒక కేంద్రపాలిత ప్రాంతానికి అత్యున్నత అధికారిగా ఉన్న వ్యక్తి ఇలాంటి నమ్మకాలను, అసత్యాలను ప్రచారం చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ట్వీట్‌ చేసే ముందు వాస్తవాలను తెలుసుకోండి అని ఎద్దేవా చేస్తున్నారు. కాగా, 40 రోజులపాటు సూర్యుడు, హీలియోస్ఫెరిక్‌ అబ్జర్వేటరీ (ఎస్‌వోహెచ్‌వో)కి చెందిన డేటాను మిచెల్సన్‌​ డాప్లర్‌ ఇమేజర్‌ సాయంతో ఎ.కొసొవికెవ్‌ అనే శాస్త్రవేత్త ప్రాసెస్‌ చేశారు. ఈ వీడియోను 2018లో నాసా యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసింది.

Next Story