ఆర్టీసీలో ఉద్యోగులకు భద్రత కల్పిస్తాం... కార్మికులపై కేసీఆర్‌ వరాల జల్లు

By Newsmeter.Network  Published on  1 Dec 2019 12:20 PM GMT
ఆర్టీసీలో ఉద్యోగులకు భద్రత కల్పిస్తాం... కార్మికులపై కేసీఆర్‌ వరాల జల్లు

ముఖ్యాంశాలు

  • ఉద్యోగ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం
  • ఆర్టీసీని లాభాల్లో తీసుకొస్తే సింగరేణి కార్మికుల మాదిరిగా బోనస్ లు
  • సమ్మెలో భాగంగా మృతి చందిన కార్మిక కుటుంబాల్లో ఒకరి ఉద్యోగం
  • ప్రతి ఏటా ఆర్టీసీకి వెయ్యి కోట్ల బడ్జెట్
  • కార్మికుల సమావేశంలో కేసీఆర్ కీలక నిర్ణయాలు

ఆర్టీసీ కార్మికులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 97 డిపోల నుంచి దాదాపు 700 మంది ఆర్టీసీ కార్మికులు హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న సెప్టెంబర్‌ నెల జీతాలను రేపటిలోగా చెల్లించాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. 52 రోజుల సమ్మె కాలానికి కార్మికులకు జీతం చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. అలాగే ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆయా డిపోలలో మహిళల కోసం ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావాలని, అలా లాభాల్లోకి తీసుకువచ్చినట్లయితే సింగరేణి కార్మికుల మాదిరిగా బోనస్‌ కూడా ఇవ్వనున్నట్లు చెప్పారు.

మహిళా ఉద్యోగుల ప్రతి సమస్యను పరిష్కరించడం కోసం.. మానిటరింగ్‌ సెల్‌ ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ అధికారులకు సూచించారు. మహిళా ఉద్యోగులకు రాత్రి 8 గంటలలోపే డ్యూటీలు ఉండేలా చూడాలని, మహిళా కార్మికుల ప్రసూతి సెలవులను పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రయాణికులు టికెట్‌ తీసుకోకుండా ప్రయాణిస్తే.. ఇకపై కండక్టర్‌లపై కాకుండా ప్రయాణికులపైనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమ్మె కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.

ఆర్టీసీలో ఉద్యోగ భద్రత కల్పిస్తాం...

ఆర్టీసీలో ప్రతి ఉద్యోగికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఒక్క ఉద్యోగిని కూడా తొలగించకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. ఒక్క రూట్‌లో కూడా ప్రైవేటు బస్సులకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి ఏటా బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికులతో కలిసి ప్రగతిభవన్‌లో మధ్యాహ్న భోజనం చేశారు. భోజనాల అనంతరం కార్మికులతో సీఎం ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సమావేశంలోరవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story