'అంబానీ' కుటుంబానికి ఐటీ నోటీసులు...

By Newsmeter.Network  Published on  28 Dec 2019 10:21 AM GMT
అంబానీ కుటుంబానికి ఐటీ నోటీసులు...

ముఖ్యాంశాలు

  • ముఖేష్ అంబానీ కుటుంబానికి ఐటీ శాఖ నోటీసులు?
  • విదేశాల్లో ఆస్తుల గురించి వివరాలు అడిగిన ఐటీ శాఖ
  • స్విస్ బ్యాంక్ ల వివరాలను బైటపెట్టిన స్విస్ లీక్స్
  • ముఖేష్ తోపాటు ఆయన పిల్లలకూ నోటీసులు
  • రిలయెన్స్ గ్రూప్ కి నోటీసులు జారీ చేసిన అధికారులు
  • బ్లాక్ మనీ నిరోధక చట్టం కింద నోటీసులు పంపిన ఐటీ శాఖ
  • 90 రోజుల్లోగా సమాధానాన్ని కోరిన ఐటీ శాఖ అధికారులు
  • దీనిపై పెదవి విప్పని రిలయెన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్

దేశంలో అంబానీ అంపైర్ జోలికి వెళ్లే సాహసం ఏ అధికారికీ లేదన్న ప్రచారం.. లోతుగా వెల్లరన్న విషయంఅందరికీ తెలిసిందే. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నాసరే ఆ ప్రభుత్వం పూర్తిగా అంబానీల చెప్పుచేతల్లో ఉండి తీరాలన్న రీతిలో అంబానీల గురించి సామాన్యులు చెప్పుకోవడమూ సహజమే. అందులో నిజానిజాలమాట పక్కనపెడితే ఇప్పుడో కొత్త వార్త దేశంలో హల్ చల్ సృష్టించింది.

బి.జె.పి ప్రభుత్వం అంబాలనీలకు కొమ్ముకాస్తోందంటూ చాలాఏళ్లుగా మీడియా, పత్రికలు కోడై కూస్తున్నాయి. అసలు పూర్తిగా దేశాన్ని ప్రధాని నరేంద్రమోడీ అంబాలనీలకు, అదానీలకు ధారదత్తం చేస్తున్నారంటూ కొన్ని నెగటివ్ కామెంట్లు కూడా పెద్ద ఎత్తున ప్రచారమవుతూ వస్తున్నాయి. ఈ నేపధ్యంలో అలాంటి ప్రచారాలు, వార్తలు పూర్తిగా అబద్ధాలని నిరూపించే కొత్త వార్త ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.

విదేశాల్లో ఉన్న ఆదాయాన్నిచ్చే ఆస్తులకు సంబంధించిన వివరాలను రిటర్న్స్ లో వెల్లడించలేదంటూ ఆదాయంపన్ను శాఖ ముఖేష్ అంబానీ తనయులు అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ, తనయ ఇషా అంబానీలకు నోటీసులు ఇచ్చిందన్నది ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న వార్త. దేశంలోని ప్రముఖమైన పేరుమోసిన పత్రికలు, టీవీ ఛానెళ్లలో దీనికి సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున ప్రచురితమయ్యాయి, ప్రసారమయ్యాయి.

రిలయెన్స్ సంస్థ ఆ నోటీసులకు సమాధానం

అపర కుబేరుడైన ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులూ ఆదాయం పన్ను శాఖ ఇచ్చిన నోటీసులకు బదులిచ్చారన్న ప్రచారమూ విస్తృత స్థాయిలో జరుగుతోంది. ఐటీ అధికారులు దీనికి సంబంధించి రిలయన్స్ సంస్థకు నోటీసులు జారీ చేశారనీ, రిలయెన్స్ సంస్థ ఆ నోటీసులకు సమాధానం కూడా ఇచ్చిందనీ ప్రచారం జరుగుతోంది.

2015లో స్విస్ లీక్స్ విడుదల కావడం, స్విట్జర్లాండ్ లోని కొన్ని హెచ్.ఎస్.బి.సి జెనీవా బ్యాంక్ ఖాతాల వివరాలు బయటికి రావడం జరిగింది. అప్పట్లో ఓ ప్రముఖ దినపత్రిక దీనికి సంబంధించి విస్తృత స్థాయిలో కథనాలను వెలువరించిందికూడా. ఆ వార్తలకు సంబంధించిన సమాచారాన్నిబట్టి కొన్ని సంస్థల ద్వారా రిలయెన్స్ గ్రూప్ లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినట్టుగా అభిజ్ఞాన వర్గాల భోగట్టా. కొన్ని స్వదేశీ సంస్థలనుంచి, మరికొన్ని విదేశీ సంస్థలనుంచి రిలయెన్స్ గ్రూప్ లోకి భారీగా నిధులు ప్రవహించాయన్నది వాటి సారాశం. మొత్తం వాటి విలువ రూ.25,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.

వీటిని ఆధారం చేసుకుని కొన్ని కీలకమైన విషయాలను తెలుసుకున్న ఐటీ శాఖ అధికారులు విదేశాల్లో ఉన్న ప్రకటించని ఆస్తులకు సంబంధించిన వివరాలు చెప్పాలంటూ బ్లాక్ మనీ యాక్ట్ 2015కింద ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులకు నోటీసులు పంపినట్టు సమాచారం. అధికారులు ఈ నోటీసుల్ని రిలయెన్స్ గ్రూప్ కి జారీ చేశారనీ, రిలయెన్స్ గ్రూప్ ముఖేష్ కుటుంబ సభ్యుల తరఫున ఆ నోటీసులకు సమాధానం కూడా ఇచ్చిందన్నది ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తున్న వార్త.

ఉక్రెయిన్ లో జరిగిన సంస్థ త్రైమాసిక సమావేశంలో ఆ ఆస్తులకు సంబంధించి చర్చ జరిగినట్టు ఐటీవర్గాల భోగట్టా. స్విజ్జర్లాండ్, సెంయిట్ లూసియా, మారిషస్, లగ్జంబర్గ్, యు.ఎస్, యు.కె, బెల్జియం దేశాల్లో ఉన్న ఆస్తుల గురించి డబుల్ టాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్, యాంటీ మనీ లాండరింగ్ అలాగే కౌంటరింగ్ ఫినాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం ప్యాక్ట్స్ నిబంధనల ప్రకారం 90 రోజుల్లోపల సదరు ఆస్తులకు సంబంధించిన వివరాలు తెలపాలంటూ ఐటీ శాఖ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది

Next Story