సమైక్య స్ఫూర్తి... మన భారత్ ప్రదాత... ఉక్కు మనిషి పటేల్ జీ..!

By సత్య ప్రియ  Published on  31 Oct 2019 3:16 AM GMT
సమైక్య స్ఫూర్తి... మన భారత్ ప్రదాత... ఉక్కు మనిషి పటేల్ జీ..!

బ్రిటిష్ వారు స్వాతంత్ర్యం పేరిట మనకు ఖండిత భారత దేశాన్ని మనకు ఇచ్చారు. భారత్- పాకిస్తాన్ పేరిట విభజించడమే కాదు, దేశంలోని 552 సంస్థానాలకు భారత్ లేదా పాక్ లో చేరొచ్చు లేదా స్వతంత్రంగా ఉండొచ్చు అనే అవకాశం ఇచ్చారు. ఇలాంటి దశలో ఒక ఉక్కు మనిషి మనకు తొలి ఉప ప్రధానమంత్రిగా,, తొలి హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దేశంలోని సంస్థానాధీశులందరినీ ఒప్పించి వారి భూభాగాలను భారత్ లో విలీనం చేశారు. మొండికేసిన హైదరాబాద్, జునాగఢ్ లపై దండోపాయం ప్రయోగించారు. భారత దేశ చిత్ర పటాన్ని మనం ఈ రోజున ఈ రూపంలో చూస్తున్నామంటే అందుకు కారణం ఉక్కు మనిషి.. ఆయనే సర్ధార్ వల్లభాయ్ పటేల్..

దేశ ప్రజలకు అందునా ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు సర్ధార్ వల్లభాయ్ పటేల్ ప్రాత:స్మరణీయులు. మనం పీల్చే స్వేచ్ఛా వాయువులు ఆ మహనీయుని పుణ్యమే.. నిరంకుశ నిజాం ప్రభువు పాలన, నరహంతక రజాకార్ పిశాచాల చేతిలో నగిలిపోతున్న హైదరాబాద్ సంస్థానాన్ని పోలీస్ యాక్షన్ ద్వారా లొంగదీసి భారత దేశంలో పూర్తిగా విలీనం చేశారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ తీసుకునే దృఢమైన నిర్ణయాల వెనుక దేశ, సమాజ హితం కనిపిస్తుంది. అందుకే ఆయనను ఉక్కు మనిషి అన్నారు.

1875 అక్టోబరు 31న గుజరాత్ లోని సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన వల్లభాయ్ పటేల్ చదువుల్లో చిన్నప్పటి నుంచీ ఎంతో చురుగ్గా ఉండేవారు. ఇంగ్లాండ్ వెళ్లి బారిస్టర్ అయ్యారు. భారత దేశానికి తిరిగి వచ్చి అహ్మదాబాద్ లో న్యాయవాద వృత్తి చేపట్టారు. ఒక రోజున పటేల్ కోర్టులో వాదిస్తుండగా టెలిగ్రామ్ అందింది. దాన్ని చదివి జేబులో పెట్టుకొని వాదన పూర్తి చేసి తన క్లయింట్ ను గెలిపించారు. ఆ టెలిగ్రామ్ లో పటేల్ భార్య మరణించిందనే సమాచారం ఉంది. అయినా కుంగిపోకుండా కేసు వాదించి గెలిచారు. వృత్తి పట్ల ఆయనకు ఉన్న నిబద్దతకు ఈ ఉదంతం అద్దం పడుతుంది.

మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమంపట్ల ఆకర్శితుడైన సర్వార్ పటేల్ న్యాయవాద వృత్తిని త్యజించి స్వాతంత్ర్య ఉద్యమంలోకి దిగారు. 1928 బార్డోలీ కిసాన్ ఉద్యమంతో వల్లభాయ్ పటేల్ కు సర్దార్ అనే పేరు బిరుదు వచ్చింది. విదేశీ వస్తు దహనంలో భాగంగా తన పాశ్యాత్య దుస్తులను ఆహుతి చేసి జీవితాంతం ఖాదీ వస్త్రాలనే కట్టుకున్నారు. గుజరాత్‌లో మద్యపానం, అస్పృశ్యత, కుల విచక్షణలకు వ్యతిరేకంగా పోరాడారు..

1931 కరాచి భారత జాతీయ కాంగ్రెస్ సదస్సుకు అధ్యక్షుడిగా వ్యవహరించిన సర్దార్ పటేల్ క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి హోంశాఖా మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు సర్దార్ వల్లభాయ్ పటేల్. భారత రాజ్యాంగ సభలో సీనియర్ సభ్యుడిగా, ప్రాథమిక హక్కుల కమిటీ ఛైర్మన్ గా పని చేశారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షునిగా నియమించడంతో పటేల్ పాత్ర చాలా ఉంది..

వాస్తవానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత తొలి ప్రధానమంత్రి కావాలని నాటి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో చాలా మంది కోరుకున్నారు. కానీ మహాత్మా గాంధీ మాత్రం జవహర్ లాల్ నెహ్రూ వైపు మొగ్గు చూపడంతో ఆ పదవి ఆయనను వరించింది. పటేల్ దృఢ చిత్తంతో సంస్థానాలన్నీ భారత్ లో విలీనమైనాయి. కానీ జమ్మూ కశ్మీర్ బాధ్యతను మాత్రం నెహ్రూ భుజాన వేసుకున్నాడు. దీని దుష్పలితం ఏమిటో మనం నేటికీ చూస్తూనే ఉన్నాం. సర్దార్ పటేల్ కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఉంటే కశ్మీర్ అంశం ఈనాడు ఒక సమస్యగా ఉండేది కాదు. ప్రధాని నెహ్రూ కశ్మీర్ అంశాన్ని ఐక్య రాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లడాన్ని వ్యతిరేకించారు. అలాగే పాకిస్తాన్ కు రూ.55 కోట్ల చెల్లింపుపై విబేధించారు. అంతే కాదు నెహ్రూ సోషలిజం సిద్దాంతాలు కూడా సర్దార్ పటేల్ కు నచ్చేవి కాదు.

తొలి రాష్ట్రపతి ఎన్నికలలో రాజగోపాలచారి వైపు నెహ్రూ మొగ్గు చూపగా, వల్లబ్ భాయి పటేల్ మాత్రం రాజేంద్ర ప్రసాద్ ను ప్రతిపాదించి సఫలీకృతుడైనారు. అలాగే 1950 కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ అభ్యర్థి కృపలానీని కాదని పురుషోత్తమ దాస్ టాండన్ ను గెలిపించారు. 1947 ఆగస్టు 15న భారత దేశ తొలి హోంమంత్రి పదవి చేపట్టిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కన్ను మూసేవరకూ అంటే 1950 డిసెంబరు 15 వరకూ ఆ పదవిలో ఉన్నారు. పటలే మరికొంత కాలం జీవించి ఉంటూ కశ్మీర్ సమస్యకు ఆనాడే పరిష్కారం దొరికేదేమో..

భారత దేశ సమైక్యత, సమగ్రతకు తొలి రూపం ఇచ్చిన మహానేత సర్దార్ వల్లభాయ్ పటేల్.. పటేల్ ను గౌరవిస్తూ నర్మదా నది తీరంలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో 182 మీటర్లు మీటర్ల ఎత్తున ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ రోజున సర్దార్ పటేల్ జయంతి. ఆ మహనీయుని స్పూర్తితో మనమంతా భారత దేశ సమగ్రత కోసం కలిసికట్టుగా పని చేద్దాం.

నేడు పటేల్ గారి పేరు మీద సామాజిక రంగాల్లో పని చేసిన వారికి భారతరత్న లాంటి మహోన్నత జాతీయస్థాయి పురస్కారాన్ని నేటునుండి నరేంద్ర మోడీ ప్రభుత్వం అందించనున్నది ఈ సందర్భంగా మోడీ గారికి కృతజ్ఞతలు.

- ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి,

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎపీ

నెహ్రూ యువ కేంద్ర నేషనల్ వైస్ చైర్మన్

భారత ప్రభుత్యం.

Next Story