నైజీరియాలో ఆత్మాహుతి దాడులు.. 19 మంది దుర్మరణం

నైజీరియాలో ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ సంఘటనలతో ఒక్కసారిగా నైజీరియా మొత్తం వణికిపోయింది.

By Srikanth Gundamalla
Published on : 30 Jun 2024 8:45 AM IST

nigeria, suicide bomb attack,  19 people died,

నైజీరియాలో ఆత్మాహుతి దాడులు.. 19 మంది దుర్మరణం 

నైజీరియాలో ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ సంఘటనలతో ఒక్కసారిగా నైజీరియా మొత్తం వణికిపోయింది. ఒకదాని తర్వాత మరోటి చోటుచేసుకోవడంతో భయాందోళన చెందారు. ఇక ఆత్మాహుతి దాడి సంఘటనల్లో 19 మంది చనిపోయారు. మరో 42 మందికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిలో 20 మందికి పైగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈశాన్య రాష్ట్రమైన బోర్నోలో ఈ ఆత్మాహుతి దాడులు జరిగాయి. స్థానిక రాష్ట్ర అత్యవసర నిర్వహణ సంస్థ ఈ సమాచారం అందించింది.

మహిళా ఆత్మాహుతి బాంబర్లుగా ఏజెన్సీ అనుమానిస్తోంది. రాష్ట్ర ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ బార్కిండో సైదు మాట్లాడుతూ.. అనుమానిత ఆత్మాహుతి బాంబర్లు వేర్వేరు చోట్ల వరుస దాడులకు పాల్పడ్డారని చెప్పారు. గ్వోజా నగరంలో ఒక పెళ్లి, అంత్యక్రియలు, ఆసుపత్రిపై ఆత్మాహుతి బాంబర్లు దాడి చేశారని తెలిపారు. మృతుల సంఖ్యపై క్లారిటీ రావాల్సి ఉందన్నారు. అయితే.. చనిపోయిన వారిలో గర్భిణులు, చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిసిందని రాష్ట్ర ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ బార్కిండో సైదు తెలిపారు.

మరోవైపు బోర్నో స్టేట్ పోలీసులు కూడా ఈ ఆత్మాహుతి దాడుల గురించి ప్రస్తుతం ఏమీ చెప్పలేదు. బోర్నో ఆఫ్ నైజీరియా చాలా ఉగ్రవాద గ్రూపులు చురుకుగా ఉన్న ప్రాంతం కావడంతో.. ఆత్మాహుతి దాడులు వారే జరిపి ఉంటారని తెలుస్తోంది. ఇస్లామిక్ స్టేట్‌తో చేతులు కలపడం ద్వారా నైజీరియాలో బోకో హరామ్ ఉగ్రవాద పరిధిని విస్తరించింది. బోకోహరాం ఇప్పటి వరకు వేలాది మందిని దారుణంగా హత్య చేసింది.

Next Story