లండన్‌లో హత్యకు గురైన మరో ఇండియన్‌.. హంతకుడు అరెస్ట్

కేరళలోని పనంపల్లికి చెందిన అరవింద్‌ శశికుమార్ (37) పదేళ్ల క్రితం స్టూడెంట్‌ వీసాపై బ్రిటన్‌కు వెళ్లాడు. లండన్ లోని..

By Srikanth Gundamalla  Published on  18 Jun 2023 6:20 AM GMT
London, Murder, Aravind, Salman, Studies

లండన్‌లో హత్యకు గురైన మరో ఇండియన్‌.. హంతకుడు అరెస్ట్

విదేశాల్లో బాగా చదువుకుని.. లైఫ్‌లో సెటిల్ అవ్వాలని చాలా మంది కలలు కంటారు. ఈ క్రమంలోనే విదేశాలకు వెళ్లి చదువుకుని.. అక్కడే స్థిరపడుతుంటారు. ఈ క్రమంలో అక్కడే చదువుకుంటోన్న కొందరు విద్యార్థులు దారుణ హత్యలకు గురవుతున్నారు. తాజాగా లండన్‌లో భారత్‌కు చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

కేరళలోని పనంపల్లికి చెందిన అరవింద్‌ శశికుమార్ (37) పదేళ్ల క్రితం స్టూడెంట్‌ వీసాపై బ్రిటన్‌కు వెళ్లాడు. అతను నగరంలోని కాంబెర్‌వెల్‌ ప్రాంతంలో ఓ అద్దె ఫ్లాట్‌లో కొందరు స్నేహితులతో కలిసి నివాసం ఉంటున్నాడు. కాగా.. శుక్రవారం రాత్రి అరవింద్‌కు.. అతని రూమ్‌లోనే ఉండే సల్మాన్‌ సలీమ్‌ అనే వ్యక్తి మధ్య గొడవ జరిగింది. మాటా మాటా పెరిగి ఘర్షణ జరిగింది. ఆవేశానికి లోనైన సల్మాన్‌ అరివింద్‌ను కత్తితో పొడిచి చంపాడు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు.

పోలీసులు ఘటనాస్థలికి చేరుకునే సమయానికి భవనం మెట్ల దగ్గర అరవింద్‌ మృతదేహం పడిఉన్నట్లు గుర్తించారు. అతని చాతిపై కత్తు పోట్లను చూశారు. అయితే.. పోలీసులు అతని ఆస్పత్రికి తరలించారు. అరవింద్‌ కత్తి పోట్ల గాయాలతో అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఆ తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం జరిపించారు పోలీసులు. అరవింద్‌ను కత్తితో పొడిచి చంపిన సల్మాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా.. ఘర్షణ సమయంలో అక్కడే ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు లండన్ పోలీసులు.

కాగా.. లండన్‌లో గత మంగళవారమే తెలంగాణకు చెందిన యువతిని దారుణంగా హత్య చేశాడు బ్రెజిల్‌కు చెందిన యువకుడు. నిందితుడి దాడిలో మరో యువతి కూడా తీవ్రంగా గాయాలపాలైంది. ఈ ఘటన మరవక ముందే లండన్‌లో భారత సంతతికి చెందిన రెండో వ్యక్తి హత్య జరగడం కలకలం రేపుతోంది.

Next Story