స్విట్జర్లాండ్ పర్వతంపై త్రివర్ణ పతాకం

By రాణి  Published on  18 April 2020 1:57 PM GMT
స్విట్జర్లాండ్ పర్వతంపై త్రివర్ణ పతాకం

  • భారత్ కు సంఘీభావం తెలిపిన స్విస్

భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం రోజు రోజుకూ పెరిగిపోతోంది. శనివారం సాయంత్రానికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 14,792కి చేరగా మృతుల సంఖ్య 488కి పెరిగింది. 248 మంది కోలుకోగా ఇప్పటి వరకూ డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2015గా ఉంది. ప్రస్తుతం 12,289 మంది కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశం నుంచి ఆ మహమ్మారిని తరిమికొట్టేందుకు భారతీయులు చేస్తున్న యుద్ధానికి సంఘీభావంగా స్విట్జర్లాండ్ ప్రభుత్వం స్విస్ ఆల్ప్స్ లోని మాటర్ హార్న్ పర్వతంపై మన జాతీయ జెండా, త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించింది. మాటర్ హార్న్ పర్వతం త్రివర్ణ జెండా ఆవిష్కరణ అనంతరం ఈ చర్య ద్వారా భారతీయులకు కరోనాపై పోరాడేందుకు కావాల్సిన నమ్మకం, శక్తి లభించాలని తాము కోరుకుంటున్నట్లు స్విస్ టూరిజం డిపార్ట్ మెంట్ సోషల్ మీడియాలో పేర్కొంది. భారతదేశం ఎంత పెద్దదో..అక్కడ ఎదుర్కోవాల్సిన సవాళ్లు కూడా అంతే పెద్దగా ఉంటాయంది.

Also Read : లోకేష్ కు హ్యాట్సాఫ్ చెప్పిన విజయసాయిరెడ్డి

కాగా..స్విట్జర్లాండ్ - ఇటలీ దేశాల మధ్యన సముద్ర మట్టానికి 4,478 మీటర్ల ఎత్తులో ఉన్న శిఖరంపై స్విస్ లైట్ ఆర్టిస్ట్ జెర్రీ హాప్స్ భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఒక్క భారత దేశపు జెండానే కాదు..కరోనా పై పోరాడుతున్న ప్రపంచ దేశాలకు మద్దతు తెలుపుతూ ఆయా దేశాల జెండాలను కూడా ఆ శిఖరంపై అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. క్లిష్ట సమయంలో స్విట్జర్లాండ్ తన ప్రేమ, సింపతీలను ఈ విధంగా ప్రపంచానికి చూటి చెప్తుందన్నారు. ఆ మహమ్మారిపై మానవత్వం ఖచ్చితంగా గెలిచి తీరుతుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.



Next Story