సమం చేస్తారా..?

By Newsmeter.Network  Published on  28 Feb 2020 3:23 PM GMT
సమం చేస్తారా..?

భారత జట్టు విదేశీ గడ్డపై సిరీస్‌లో తొలి టెస్టు ఓడిన తర్వాత.. కోలుకుని మ్యాచ్‌ గెలుచుకోని సిరీస్‌ను కాపాడుకోవడం చాలా అరుదు. ప్రస్తుతం టీమిండియా అదే పరిస్థితిలో ఉంది. తొలి టెస్టులో 10 వికెట్ల ఘోర ఓటమి అనంతరం.. ఇప్పుడు రెండో టెస్టును కచ్చితంగా నెగ్గాల్సిన ఒత్తిడిలో భారత జట్టు బరిలోకి దిగుతోంది. మరోవైపు సొంత ప్రేక్షకుల మధ్య టీమిండియాను మరోసారి ఓడించి సిరీస్ గెలవాలని భావిస్తోంది న్యూజిలాండ్‌.

భార‌త్-న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య శ‌నివారం నుంచి రెండు టెస్టుల సిరీస్‌లో ఆఖ‌రిదైన రెండో మ్యాచ్ ప్రారంభం కానుంది. టి20 సిరీస్‌ను భారత్, వన్డే సిరీస్‌ను కివీస్‌ క్లీన్‌స్వీప్‌ చేయగా...టెస్టు సిరీస్‌లో ప్రస్తుతం 1–0తో ఆతిథ్య జట్టు ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌ చెలరేగి సిరీస్‌ను సమం చేస్తుందా లేక చేతులెతేస్తుందా అనేది ఆసక్తికరం.

తుది జట్టులో మార్పులుంటాయ్‌..

టీమిండియా తుది జట్టులో రెండు, మూడు మార్పులు చోటు చేసుకునే అవ‌కాశ‌ముంది. తొలి టెస్టులో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్, వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే మినహా ఎవ్వరూ కూడా పెద్దగా ప్రతిఘటించలేదు. ఇక పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీ కివీస్‌ పర్యటనలో ఆశించినంత స్థాయిలో రాణించలేదు. మూడు ఫార్మాట్లలో కూడా తనదైన ముద్రను వేయలేకపోయాడు. కనీసం చివరి టెస్టులోనైనా విరాట్ ఫామ్‌లోకి వస్తే.. టీమిండియా భారీ స్కోర్‌ సాధించే అవకాశం ఉంది. కాగా.. ఓపెనర్‌ పృధ్వీ షా గాయంతో బాధపడుతుండడంతో ఈ మ్యాచ్‌లో మయాంక్‌ కు తోడుగా శుభ్‌మన్‌గిల్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే.. శుక్రవారం కోచ్‌ రవిశాస్త్రి మాట్లాడుతూ.. పృధ్వీ కోలుకుంటున్నాడని.. మ్యాచ్‌ సమయానికి అందుబాటులోకి వస్తాడని చెప్పారు. దీంతో.. పృధ్వీ బరిలోకి దిగుతాడా.. లేదా అనేది సందిగ్ధంలో పడింది. ఆరో స్థానంలో తెలుగు కుర్రాడు హనుమ విహారికి మరో అవకాశం దక్కొచ్చు. సీనియర్‌ బ్యాట్స్‌ మెన్‌ పుజారా నుంచి టీమిండియా భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది.

తొలి టెస్టులో బౌలింగ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన అశ్విన్‌ స్థానంలో జడేజాను తీసుకోనున్నారు. జడేజా ఫీల్డింగ్‌తో పాటు ఎంతో కొంత బ్యాటింగ్‌ చేసే అవకాశం ఉండడంతో ఈ మార్పు ఖాయంగా కనిపిస్తోంది. పుల్ ఫాంలో ఉన్న ఇషాంత్ శర్మ గాయంతో దూరం అవ్వడం పెద్ద ఎదురుదెబ్బ కానుంది. అసలే పిచ్ ఫాస్టు బౌలింగ్‌కు అనుకూలించనుదన్న వార్తల నేపధ్యంలో ఇషాంత్ లేకపోవడం టీమిండియాకు లోటే. షమీ, బుమ్రాలకు తోడుగా.. ఉమేష్‌ యాదవ్‌ బరిలోకి దిగనున్నాడు.

ఉత్సాహాంగా కివీస్‌..

ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌ మాత్రం రెట్టించిన ఉత్సాహాంతో ఉంది. తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో విజయం సాధించడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. ఓపెనర్లు లాథమ్, బ్లన్‌డెల్‌ శుభారంభాలు ఇస్తుండగా.. మిడిల్‌ ఆర్డర్‌లో సీనియర్‌ ప్లేయర్లు కెప్టెన్‌ విలియమ్‌ సన్‌తో పాటు రాస్‌ టేలర్లు బ్యాటింగ్‌ భారాన్ని మోస్తున్నారు. నికోల్స్, వాట్లింగ్‌లతో జట్టు బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా ఉంది.

బౌలింగ్‌లో సౌతీ, బౌల్ట్‌ జోడి మరోసారి భారత్‌ను దెబ్బ తీసేందుకు సిద్ధమైంది. వ్యక్తిగత కారణాలతో గత మ్యాచ్‌కు దూరమైన ప్రధాన పేసర్‌ నీల్‌ వాగ్నర్‌ మళ్లీ జట్టులోకి వచ్చాడు. అతడి రాకతో కివీస్‌ బౌలింగ్‌ లైనస్‌ మరింత పటిష్టంగా మారింది. కాగా.. ఎవరి స్థానంలో అతడిని ఆడించాలనేది మేనేజ్‌మెంట్‌కు సమస్యగా మారింది. తొలి టెస్టులో జేమీసన్‌ ఆకట్టుకున్నాడు. అయితే గురువారంనాడు హాగ్లీ ఓవల్‌ పిచ్‌ పరిస్థితి చూస్తే పూర్తిగా పేసర్లకు అనుకూలించేలా కనిపిస్తోంది. అదే జరిగితే తొలి టెస్టులో కేవలం 6 ఓవర్లు వేసిన స్పిన్నర్‌ ఎజాజ్‌ పటేల్‌ స్థానంలో వాగ్నర్‌ను తీసుకొని నలుగురు పేసర్లతో బరిలోకి దిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.

మయాంక్‌, కోహ్లీలు ఆ రికార్డులు అందుకునేనా..?

అంత‌ర్జాతీయంగా 22వేల ప‌రుగుల మార్కును చేరుకునేందుకు భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీకి మ‌రో 116 ప‌రుగులు కావాలి. రెండో టెస్టులో ఈ ప‌రుగులు చేస్తే 22వేల మార్కును అందుకున్న మూడో భార‌త ప్లేయ‌ర్‌గా నిలుస్తాడు. అలాగే అత్యంత వేగంగా ఈ ఘ‌న‌త‌ను చేరుకున్న ప్లేయ‌ర్‌గా రికార్డుల‌కెక్కుతాడు. ప్ర‌స్తుతం కోహ్లీ ఖాతాలో 21,884 ర‌న్స్ ఉన్నాయి. కోహ్లీ కంటే ముందు స‌చిన్, రాహుల్ ద్ర‌విడ్ ఉన్నారు.

భార‌త టెస్టు ఓపెన‌ర్ మ‌యాంక్ అగ‌ర్వాల్‌ వెయ్యి ప‌రుగుల మార్కును చేరుకునేందుకు మ‌రో 36 ప‌రుగుల దూరంలో నిలిచాడు. రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో మ‌రో 36 ప‌రుగులు సాధిస్తే అత్యంత వేగంగా వెయ్యి ప‌రుగులు సాధించిన రెండో భార‌త‌ క్రికెట‌ర్‌గా వినోద్ కాంబ్లీ త‌ర్వాత మ‌యాంక్ నిలుస్తాడు. గతంలో కాంబ్లీ 14 ఇన్నింగ్స్‌ల‌లోనే వెయి పరుగుల మార్కును అందుకున్నాడు. మ‌రోవైపు రెండో టెస్టు మ‌యాంక్‌కు కెరీర్‌లో 11వ‌ది కావ‌డం విశేషం. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో క‌లిపి 36 ర‌న్స్ చేస్తే అతి త‌క్కువ టెస్టుల్లో వెయ్యి ప‌రుగుల మార్కును చేరిన భార‌తీయునిగా రికార్డుల‌కెక్కుతాడు.

న్యూజిలాండ్ గ‌డ్డ‌పై భార‌త్ చివ‌రిసారిగా 2009లో విజ‌యం సాధించింది. హామిల్ట‌న్‌లో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో ఆధిప‌త్యం క‌న‌బ‌ర్చిన టీమిండియా గెలుపొందింది. గ‌త 43 ఏళ్ల కాలంలో 19 టెస్టులు ఆడిన భార‌త్ ఎనిమిదింటిలో ఓడిపోగా.. ప‌ది మ్యాచ్‌ల‌ను డ్రాగా ముగించింది.

Next Story