నువ్వా.. నేనా.? అన్నట్లు ఇరు జట్లు.. ఫైనల్ ఎవరిదో.?
By Medi Samrat Published on 10 Nov 2019 9:13 AM GMTముఖ్యాంశాలు
- నేడే చివరి టీ20
- నాగపూర్ వేదికగా 7గంటలకు ప్రారంభం
బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్లో నేడు చివరి టీ20 జరుగనుంది. ఈ సిరీస్లో టీమిండియా పైచేయి సాధిస్తుందని అంతా భావించారు. కానీ.. బంగ్లా ఆటగాళ్లు అంచనాలను తలక్రిందులు చేసి తొలి టీ20లో అద్భుత విజయాన్ని సాధించారు. రెండో మ్యాచ్లో రోహిత్ సేన విజయం సాధించడంతో మూడో మ్యచ్ నిర్ణయాత్మకం అయ్యింది. దీంతో ఇరు జట్లు సిరీస్ దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి.
అయితే.. ఈ మ్యాచ్లో టీమిండియా ఒక మార్పుతో బరిలోకిదిగే అవకాశం ఉంది. పేసర్ ఖలీల్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్థానంలో సంజు శాంసన్ను తీసుకునే అవకాశం లేకపోలేదు. బంగ్లాదేశ్ తొలి మ్యాచ్ విజయంలో ముష్ఫికర్ రహీమ్దే కీలక పాత్ర. రహీమ్ గత మ్యాచ్లో విఫలం కాగా.. కెప్టెన్ మహ్ముదుల్లా ఫర్వాలేదనిపించాడు. సీనియర్లయిన వీరిద్దరు మరోసారి రాణించడంపై ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
ఇదిలావుంటే.. నాగ్పూర్ పిచ్ బ్యాటింగ్ వికెట్. స్పిన్ బౌలింగ్కు అనుకూలిస్తుంది. భారీ స్కోర్లకు అవకాశం తక్కువ. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టునే విజయం వరించే అవకాశాలు ఎక్కువ. గతంలో ఇక్కడ జరిగిన 11 మ్యాచ్ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టే 8సార్లు గెలిచింది. వర్షం పడే అవకాశాలు చాలా తక్కువ. రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం అవనుంది.