ఓడినా.. టెస్టు ర్యాంకింగ్స్‌లో మనదే అగ్రస్థానం.. అయితే..

By Newsmeter.Network  Published on  3 March 2020 4:23 PM GMT
ఓడినా.. టెస్టు ర్యాంకింగ్స్‌లో మనదే అగ్రస్థానం.. అయితే..

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. న్యూజిలాండ్ చేతిలో 0-2తో కోల్పోయిన భారత్‌ జట్టు.. ర్యాంకింగ్స్‌లో మాత్రం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. అయితే.. రెండో స్థానంలో ఉన్న కివీస్‌ కంటే భారత్‌ 6 పాయింట్ల ఆధిక్యంలో మాత్రమే ఉంది. భారత్‌ ఖాతాలో 116 పాయింట్లు ఉండగా.. కివీస్‌ 110, ఆస్ట్రేలియా 108 పాయింట్లలతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఇదిలా ఉండగా.. రెండు టెస్టుల్లో విఫలమైన కోహ్లీ.. రెండో స్థానంలోనే కొనసాగుతున్నాడు. అయితే అతనికి అగ్రస్థానంలో ఉన్న ఆసీస్‌ ఆటగాడికి మధ్య 25 పాయింట్ల అంతరం ఉంది. స్టీవ్‌స్మిత్ 911 పాయింట్లతో ఉండగా.. విరాట్‌ ఖాతాలో 886 పాయింట్లు ఉన్నాయి. టాప్‌ టెన్‌లో కోహ్లీతో పాటు భారత్ నుంచి చ‌టేశ్వ‌ర్ పుజారా ఏడు, అజింక్య ర‌హానే తొమ్మిదో ప్లేస్‌లో నిలిచారు. కివీస్‌తో సిరీస్‌తో పునరాగమనం చేసిన టీమిండియా ఓపెనర్‌ పృథ్వీ షా తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నాడు. 17 స్థానాలు ఎగబాకి 76 ర్యాంక్‌లో నిలిచాడు. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్ 11వ స్థానంలో కొనసాగుతున్నాడు.

బౌల‌ర్ల జాబితాలో భారత పేస‌ర్ జ‌స్‌ప్రీత్ ఒక్కడే టాప్‌ 10లో కొనసాగుతున్నాడు. 779 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండ‌ర్ల జాబితాలో ర‌వీంద్ర జ‌డేజా, ర‌విచంద్ర‌న్ అశ్విన్ వ‌రుస‌గా మూడు, ఐదు స్థానాల్లో నిలిచారు.

Next Story