ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు
By Newsmeter.Network Published on 6 April 2020 12:25 PM ISTకరోనా మహమ్మారి ఏపీలో విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం సాయంత్రం 6గంటల వరకు ఏపీలో 252 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా ఆదివారం సాయంత్రం 6గంటల నుంచి సోమవారం ఉదయం 9గంటల వరకు కొత్తగా 14 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్ విడుద లచేసింది. దీంతో మొత్తం 266 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కొత్తగా నమోదైన కేసుల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకటి, గుంటూరులో 2, కర్నూల్ జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో ఐదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్తో చికిత్స పొందుతున్న వారిలో ఇప్పటి వరకు ఐదుగురు కోలుకున్నారని, వారిని డిశ్చార్జి చేసినట్లు అధికారులు తెలిపారు.
కరోనా వైరస్తో బాధపడుతూ రాష్ట్రంలో కొత్తగా ఇద్దరు మృతిచెందారు. అనంతపురం జిల్లాకు చెందిన 64ఏళ్ల వ్యక్తి, మచిలీపట్టణంకు చెందిన 55ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. జిల్లాల వారిగా నమోదైన పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే.. అనంతపురంలో 6, చిత్తూరులో 17, తూర్పు గోదావరి జిల్లాలో 11, గుంటూరులో 32, కడప జిల్లాలో 23, కృష్ణా 28, కర్నూల్ 56, నెల్లూరు 34, ప్రకాశం 23, విశాఖపట్టణం 20, పశ్చిమ గోదావరి జిల్లాలో 16 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే శ్రీకాకుళం, వైజాగ్లలో ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదు.