యువకులను చితకబాదిన పోలీసులపై ఐజీ నాగిరెడ్డి తీవ్ర అగ్రహం
By Newsmeter.Network Published on 2 Jan 2020 5:58 AM GMTరాజన్న సిరిసిల్ల జిల్లాలో యువకులను చితకబాదిన పోలీసులపై ఐజీ నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు ఎస్సైలు, కానిస్టేబుల్, హోంగార్డ్ను హెడ్క్వార్టర్స్కు అటాచ్ చేయాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే వారిని హెడ్క్వార్టర్స్కు అటాచ్ చేశారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం సేవించి యువకులు బహిరంగంగా న్యూసెన్స్ చేస్తున్నారన్న అభియోగంతో పోలీసులు వారిని చితకబాదారు. కొట్టొద్దంటూ వేడుకున్న ఆ యువకులను పోలీసులు వదలలేదు.
ఈ తతంగాన్ని కొందరు యువకులు అక్కడే ఉన్న బిల్డింగ్పై నుంచి వీడియో తీశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియో చూస్తున్న నెటిజన్స్ పోలీసులుపై మండిపడుతున్నారు. ఖాకీల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు తమను కావాలనే కొట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమను పోలీసులు ర్యాగింగ్ చేశారని, మద్యం సేవించి పట్టుబడిన బైక్లను స్టేషన్ తీసుకువస్తే వదిలిపెడతామని అన్నారని బాధితులు చెప్తున్నారు. ఎక్కడో గల్లీలో ఉన్న తమను రోడ్డుపైకి తీసుకొచ్చి కొట్టారంటూ వాపోయారు. ఎంత తాగిన మరి ఇంత దారుణంగా కొట్టాలా, ఇలాంటి శిక్షలు వేయడం ఏంటని స్థానికులు మండిపడుతున్నారు.