ఎస్‌ బ్యాంకులో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన ప్రైవేట్‌ బ్యాంకులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 March 2020 3:42 PM GMT
ఎస్‌ బ్యాంకులో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన ప్రైవేట్‌ బ్యాంకులు

సంక్షోభంలో ఉన్న ఎస్‌బ్యాంక్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేటు రంగ బ్యాంకులు ముందుకొస్తున్నాయి. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌, కొటాక్‌ మహీంద్రాలు బ్యాంకులు ఎస్‌బ్యాంకులో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇంతకముందు ఎస్‌బ్యాంకు షేరు రూ.10 చొప్పున 725 కోట్ల కొనుగోలు ద్వారా రూ. 7,250 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎస్‌బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా ప్రైవేటుబ్యాంకు దిగ్గజం ఐసీఐసీఐ కూడా రూ. 1,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. 100 కోట్ల ఈక్విటీ షేర్లను షేరుకు రూ.10 చొప్పున కొనుగోలు చేయనుంది. దీంతో ఎస్‌బ్యాంకులో ఐసీఐసీఐకు 5 శాతం వాటా దక్కనుంది. శుక్రవారం జరిగిన యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో 60 కోట్ల వరకు ఈక్విటీ షేర్ల కొనుగోలుకు రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టడానికి అనుమతి ఇచ్చిందని బ్యాంకు తెలిపింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 ప్రకారం యస్‌ బ్యాంక్ పునర్నిర్మాణం ప్రతిపాదిత ప్రణాళికలోఈక్విటీ షేరుకు రూ .2 (రూ.8 ప్రీమియంతో)కు కొనుగోలు చేయనున్నామని యాక్సిస్ బ్యాంక్ ఎక్స్ఛేంజీలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

ఇక హెచ్‌డీఎఫ్సీ మరో రూ.1000కోట్లు పెట్టనుంది. కొటాక్‌ మహీంద్రా బ్యాంకు 50కోట్ల షేర్లు కొనుగోలుకు రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఎస్‌బ్యాంకు ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారటంతో ఆర్‌బీఐ దానిపై మారటోరియం విధించిన సంగతి తెలిసిందే.

Next Story