బేగంపేట మెట్రోస్టేషన్ లో పెచ్చులూడి వర్షం నీరు కారుతున్న దృశ్యం
By న్యూస్మీటర్ తెలుగు Published on 4 Oct 2019 12:38 PM GMTహైదరాబాద్ : అమీర్పేట్ మెట్రోస్టేషన్లో వర్షానికి పెచ్చులూడి పడి మహిళ మృతి చెందిన ఘటన ఇకా మరువలేదు. మెట్రో స్టేషన్లలో భద్రతపై మంత్రి కేటీఆర్ నివేదిక అడిగి రోజులు కూడా గడవలేదు. మరమ్మతులు చేస్తున్నామని మెట్రో అధికారులు ప్రకటించి వారం కూడా కాలేదు. మెట్రో స్టేషన్లలో లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. మంత్రి కేటీఆర్ ఆదేశాలు కూడా మెట్రో అధికారులు పక్కన పెట్టారేమో అనిపిస్తోంది.
చిన్న వానకే మెట్రో స్టేషన్ పెచ్చులూడి పోతున్నాయి. వాన నీళ్లు దారళంగా కారిపోతున్నాయి. బేగంపేట సి1321 మెట్రో రైల్ బ్రిడ్జ్ అడుగు భాగంలో పెచ్చులూడి పడి కిందకు వర్షం నీరు కారుతున్న దృశ్యాలను మొబైల్స్లో బంధించారు ప్రయాణికులు. మెట్రో స్టార్ట్ అయిన కొన్ని నెలలకే ఇలా పెచ్చులూడి వాన నీళ్లు కారడంపై ప్రయాణికులు, నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.
మెట్రో అధికారులు ఇప్పటికైనా మేల్కోని మరమ్మతులు చేపట్టాలని నగరవాసులు, మెట్రో ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.