సువర్ణ భూమి సంస్థ మోసానికి పాల్పడిందా?

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ పై కేసులు నమోదయ్యాయి. ఫ్లాట్ లు విక్రయిస్తామని జనం దగ్గరి నుంచి పెద్ద ఎత్తున

By News Meter Telugu  Published on  15 Jun 2023 12:57 PM GMT
Suvarnabhumi Developers, Case Booked, Real estate, plots

సువర్ణ భూమి సంస్థ మోసానికి పాల్పడిందా?

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ పై కేసులు నమోదయ్యాయి. ఫ్లాట్ లు విక్రయిస్తామని జనం దగ్గరి నుంచి పెద్ద ఎత్తున డబ్బు తీసుకొని మోసానికి పాల్పడడంతో సువర్ణభూమి రియల్ ఎస్టేట్ సంస్థ పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై కేసులు నమోదయ్యాయి. సువర్ణ భూమి డెవలపర్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బొల్లినేని శ్రీధర్‌తో పాటు సంస్థ ఉద్యోగులపై జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫ్లాట్లు ఇస్తామని డబ్బు తీసుకుని మోసం చేశారంటూ పలువురు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి.

జూబ్లీహిల్స్‌ రోడ్ నంబ్ 5లో సువర్ణభూమి డెవలపర్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వెంచర్ ప్రారంభించారు. 2017లో షాద్‌నగర్‌ సమీపంలో సువర్ణ కుటీర్‌ పేరుతో వెంచర్ వేసి ఫ్లాట్ల విక్రయాలు జరిపారు. ఈ క్రమంలో కృష్ణానగర్‌కు చెందిన కొండల్‌రావు అనే వ్యక్తితో పాటు సినీ పరిశ్రమలో పనిచేసే 21మంది రూ.6లక్షల నుంచి రూ.50లక్షల వరకు నగదు చెల్లించి ఫ్లాట్లను కొనుగోలు చేశారు. వీరిని గంగిరెడ్డి దస్తగిరిరెడ్డి షాద్‌నగర్‌ తీసుకువెళ్లి ఫ్లాట్లను చూపించి వారితో డబ్బులు కట్టించాడు. ఆ తర్వాత సంస్థ ఎండీ బొల్లినేని శ్రీధర్, జిఎం ప్రవీణ‌ కుమార్‌, ఈడీ ఎం.శ్రీనివాస తదితరులతో పలుమార్లు మాట్లాడి వాయిదాల్లో డబ్బులు చెల్లించారు. 2022లో కొనుగోలు చేసిన వారికి ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పి.. మాట తప్పారు. బాధితులు ఎప్పుడు అడిగినా జాప్యం చేస్తూ ఉండడంతో బాధితులు జూబ్లీహిల్స్‌లోని సంస్థ కార్యాలయానికి వెళ్లి నిలదీశారు. బాధితులు చెల్లించిన సొమ్ములో 20శాతం మాత్రమే సంస్థకు ముట్టిందని, మిగిలిన మొత్తం తమకు చేరలేదని అన్నారు. దీంతో బాధితులు షాక్ అయ్యారు. ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయలేమని చెప్పడంతో ఆందోళనకు గురైన బాధితులు తాము నగదు చెల్లించిన రశీదులు సువర్ణభూమి నిర్వాహకులకు చూపించారు. బాధితులు చూపిన రశీదుల్లో కొన్ని మాత్రమే అసలైనవని, మిగిలిన వాటితో సంస్థకు సంబంధం లేదని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. దీంతో తమను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాదితులు ఫిర్యాదు చేశారు.

దీంతో సంస్థ ఎండీతో పాటు మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బొల్లినేని శ్రీధర్, ప్రవీణ్ కుమార్, ఎం శ్రీనివాస్, గంగిరెడ్డి రెడ్డిలపై కేసు నమోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని 34వ సెక్షన్‌తో పాటు 406, 420, 467, 471 వంటి సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉందని జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి ధృవీకరించారు.

Next Story