కోల్కత్తా కేంద్రంగా.. హనీట్రాప్ దందా..!
By న్యూస్మీటర్ తెలుగు Published on 26 Oct 2019 9:50 AM GMTసోషల్ మీడియాలో ఈ మధ్య పెడుతున్న పోస్టుల్లో..ఏది నిజమో? ఏది అబద్దమో? తెలుసుకోవడం యూజర్స్కి కొంచెం కష్టంగానే మారింది. ఇదే అదునుగా తీసుకున్న హనీట్రాప్ దందా దేశ వ్యాప్తంగా యువతను టార్గెట్ చేసింది. కోల్కత్తా కేంద్రంగా తన కార్యాకలాపాలకు తెరలేపింది. ప్రస్తుతం ఆ కిలాడీ గ్యాంగ్ విశాఖ యువతను టార్గెట్ చేసింది. ఫేక్ డేటింగ్ వెబ్ సైట్తో యువతను ట్రాప్ చేసింది.
అందమైన అమ్మాయిల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి..డేటింగ్ పేరుతో యువతను మోసానికి పాల్పడింది. దీనిలో భాగంగానే ఆ కిలాడీ గ్యాంగ్ ఓ యువకుని నుంచి రూ.18 లక్షలు..మరో యువకుని నుంచి రూ.3 లక్షలు వసూలు చేసింది. వీరు కాకుండా దేశవ్యాప్తంగా హనీట్రాప్ దందా బాధితులు చాలా మందే ఉన్నారు. అయితే ఆ బాధితుల ఫిర్యాదు మేరకు హనీట్రాప్ దందా గ్యాంగ్లోని 24 టెలీకాలర్లతో సహా..మొత్తం 27 మందిని విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి నుంచి 3 ల్యాప్ టాప్లు, 40 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారం ఓస్లాం ఐటీ ముసుగులో గుట్టు చప్పుడు కాకుండా.. జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.