రెండు వేల అదృశ్యాల కేసులను రీ ఓపెన్ చేయించండి..
By రాణి Published on 6 Jan 2020 4:23 PM IST
రాష్ర్ట వ్యాప్తంగా మైనర్ బాలికల అదృశ్యంపై న్యాయవాది రాపోలు భాస్కర్ హై కోర్టులో పిల్ దాఖలు చేశారు. రాష్ర్టంలో మైనర్ పిల్లల అదృశ్యంపై నమోదైన కేసులన్నింటినీ పోలీసులు పట్టించుకోకుండా మూసివేశారని, ఈ కేసులను మళ్లీ రీ ఓపెన్ చేయించాలని పిటిషనర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. హాజీపూర్ లో ముగ్గురు బాలికలు అదృశ్యమైన మాదిరిగానే ఈ మైనర్ బాలికల అదృశ్యం కూడా జరిగి ఉంటుందని పిటిషనర్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రతి జిల్లాకు ఒక స్పెషల్ అధికారిని నియమించి, విచారణ చేపట్టాలని పిటిషనర్ కోరారు.
రాష్ర్టవ్యాప్తంగా మూసివేసిన 2 వేల మిస్సింగ్ కేసులను తిరిగి తెరిపించి, విచారణ జరిపించాలని పిటిషనర్ విన్నవించారు. ఈ పిటిషన్ పై విచారణ చేసిన ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ..తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఆ మధ్యకాలంలో హాజీపూర్ లో ముగ్గురు మైనర్ బాలికల అదృశ్యం..వారి మృతదేహాలు ఊరి చివరిలోని మూతపడిన బావి వద్ద దొరకడం పెద్ద ఉదంతమయింది. పోలీసులు ఈ ఘటనలపై ఆరా తీయగా..ఊర్లోనే ఉంటున్న శ్రీనివాస్ అనే వ్యక్తి బాలికలను ట్రాప్ చేసి, అత్యాచారం చేసిన తర్వాత వారిని చంపేస్తున్నాడని తేలడంతో...అతడిని అరెస్ట్ చేశారు. ఈ నెలలో శ్రీనివాస్ ను కోర్టులో హాజరు పరుచగా..కోర్టు జడ్జి అతడిని అత్యాచారాలపై ప్రశ్నించారు. ఆ ముగ్గురు బాలికల అదృశ్యం, హత్యలతో తనకెలాంటి సంబంధం లేదన్నాడు శ్రీనివాస్. తనకు మగతనమే లేదని, తానొ నపుంసకుడిని అని శ్రీనివాస్ కోర్టుకు తెలిపాడు.