హజీపూర్ హత్యలకు.. నాకు సంబంధం లేదు..!
By Newsmeter.Network Published on 4 Jan 2020 11:37 AM IST
నల్గొండ: హాజీపూర్ వరుస హత్యలకు, తనకు సంబంధం లేదని నిందితుడు శ్రీనివాస్రెడ్డి జడ్జి ఎదుట చెప్పాడు. పోలీసులు కావాలనే నన్ను ఇరికించారని, సాక్ష్యాలన్ని అబద్దమేనని కోర్టులో తెలిపాడు. పోలీసులు నా వీర్యం సేకరించారని, తనకు స్మార్ట్ ఫోన్ కూడా లేదని, మృతుల దుస్తులపై ఉన్న వీర్యానికి, తనకు సంబంధం లేదంటూ మర్రి శ్రీనివాస్రెడ్డి కోర్టులో తన చెప్పుకొచ్చాడు. తాను నపుంసకుడినని.. అలాంటి అత్యచారం ఎలా చెస్తానని చెప్పాడు. హాజీపూర్ వరుస హత్యల కేసుపై శుక్రవారం నల్గొండలో కోర్టులో విచారణ జరిగింది.
సుమారు ఆరు గంటల పాటు న్యాయమూర్తి విశ్వనాథరెడ్డి ఈ కేసు విచారణ సాగించారు. నిందితుడి తరఫు న్యాయవాది ఎస్.ఆర్.ఠాగూర్, ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాదులు హాజరయ్యారు. నిందితుడు శ్రీనివాస్ రెడ్డి నుంచి సేకరించిన సమాధానాలను రికార్డు చేశారు. సాక్షుల వాంగ్మూలాలను న్యాయవాది చదివి వినిపించారు. ముగ్గురు విద్యార్థులను శ్రీనివాస్రెడ్డే హత్య చేశాడని సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. దీనిపై సమాధానం ఏంటి అని న్యాయవాది అడిగాడు. దీంతో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఆ హత్యలకు నాకు ఎటువంటి సంబంధం లేదు. తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని శ్రీనివాస్ రెడ్డి చెప్పాడు.
విద్యార్థినిలను హత్య చేసి మర్రిబావిలో పాతిపెట్టావు, అందరి ముందు కూడా నిజం ఒప్పుకున్నావు అని న్యాయమూర్తి అడగ్గా.. అంతా అబద్దం, తాను బావి వద్దకు వెళ్లలేదని, పోలీస్స్టేషన్లోనే ఉంచారని శ్రీనివాస్రెడ్డి చెప్పాడు. పని చేసే చోట వేశ్యని హత్య చేశావని, దానికి సంబంధిం కర్నూలులో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేశారని న్యాయమూర్తి అడగ్గా.. అలాంటిదేమి తను చేయలేదని సమాధానం ఇచ్చాడు.
హత్యలు చేయలేదనడానికి నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని న్యాయవాది శ్రీనివాస్రెడ్డిని ప్రశ్నించాడు. తన తల్లిదండ్రులను పిలిచి అడగాలని సమాధానం చెప్పాడు. అయితే వారు ఎక్కడున్నారనేది తనకు తెలియదన్నాడు. నువ్వు పని చేసిన వారి అడ్రస్ ఇవ్వాలని న్యాయమూర్తి అడగగా.. తన దగ్గర వారి అడ్రస్ కూడా లేదని, తన తల్లిదండ్రులను పిలిపించాలన్నాడు. అడ్రస్ తెలియకుండానే ఎలా పని చేశావంటూ న్యాయమూర్తి అడిగాడు. తనకు తెలవదని న్యాయమూర్తికి నిందితుడు విన్నవించుకున్నాడు. తదుపరి విచారణ జనవరి 6వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.