ఒకే ఇంట్లో ఆరు మృతదేహాలు: నలుగురు పిల్లలకు ఉరివేసి అన్నదమ్ముల ఆత్మహత్య.. భార్యలు షాక్‌

By సుభాష్  Published on  20 Jun 2020 3:44 PM IST
ఒకే ఇంట్లో ఆరు మృతదేహాలు: నలుగురు పిల్లలకు ఉరివేసి అన్నదమ్ముల ఆత్మహత్య.. భార్యలు షాక్‌

దేశంలో ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, ఆనారోగ్య సమస్యలు, మానసిక ఇబ్బందులు ఇలా ఎన్నో కారణాల వల్ల కుటుంబ సభ్యులతో పాటు ముక్కుపచ్చలారని చిన్నారులు సైతం కానరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. తాజాగా గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఒకే ఇంట్లో నలుగురు పిల్లలకు ఉరివేసి అన్నదమ్ములిద్దరూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకే కుటుంబానికి ఆరుగురు ఆత్మహత్యకు పాల్పడటంతో సంచలనంగా మారింది. అయితే మృతుల్లో చిన్నారులు ఉండటం అత్యంత బాధకరంగా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరులు అమ్రిష్‌ పటేల్‌ (41), గౌరంగ్‌పటేల్‌ (40), వారి భార్యా పిల్లలతో వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. గురువారం ఇద్దరు ఆన్నదమ్ములు పిల్లలను తీసుకుని బయటకు వెళ్తామని భార్యలతో చెప్పి వెళ్లారు. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో ఫోన్ చేసినా లిప్ట్ చేయకపోవడంతో శుక్రవారం వారికి ఉన్న ప్లాట్ వద్దకు వెళ్లి చూశారు. లోపలి నుంచి లాక్‌చేసి ఉంది. ఎన్నిసార్లు కాలింగ్‌ బెల్‌ కొట్టినా తీయడం లేయకపోవడంతో ఫోన్‌ చేశారు. కంగారు పడ్డ వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు తలుపులను బద్దలు కొట్టి చూడగా, ఆరుగురు ఉరివేసుకుని నిర్జీవంగా వేలాడుతూ కనిపించారు. అందులో నలుగురు పిల్లలకు అన్నంలో మత్తు మందు కలిపి ఇచ్చి నిద్రలోకి జారుకున్నతర్వాత ఉరివేసినట్లు, అనంతరం అన్నదమ్ములిద్దరూ ఉరివేసుకుని ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.

దీంతో ఇద్దరు భార్యలు షాక్‌కు గురై కుప్పకూలిపోయారు. మృతదేహాలను ఫోరెన్సిక్‌ పరీక్షల నిమిత్తం పంపించినట్లు పోలీసు ఇన్‌స్పెక్టర్‌ డీఆర్‌ గోహిల్‌ తెలిపారు. కాగా, మృతుల్లో నలుగురు చిన్నారులు.. కీర్తీ (9), శాన్విని (7), మయూర్‌ (12), ధ్రువ్‌ (11) ఉన్నారు. నలుగురిలో ఇద్దరిని వంట గదిలో, మరో ఇద్దరిని బెడ్‌ రూమ్‌లో, అన్నదమ్ములిద్దరూ డ్రాయింగ్‌ రూమ్‌లో ఉరివేసుకుని ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే భార్యలను వదిలిపెట్టే పిల్లలతో పాటు భర్తలు కూడా ఆత్మహత్యకు పాల్పడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులను ప్రత్యేకంగా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Next Story