జీహెచ్‌ఎంసీ నా కాలు విరగ్గొట్టింది.. పోలీస్ స్టేషన్‌లో ఓ వ్యక్తి ఫిర్యాదు!

By Medi Samrat  Published on  11 Oct 2019 7:56 AM GMT
జీహెచ్‌ఎంసీ నా కాలు విరగ్గొట్టింది.. పోలీస్ స్టేషన్‌లో ఓ వ్యక్తి ఫిర్యాదు!

ఓ వ్యక్తి జీహెచ్‌ఎంసీపై కేసు పెట్టాడు. తాను బైక్‌పై వెళ్తుండగా ఓ గుంతలో పడి కాలు విరిగిందని.. దానికి కారణం జీహెచ్‌ఎంసీనే అంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో కేసు దాఖలు చేశాడు.

వివరాల్లోకెళితే.. పంజాటన్‌ కాలనీకి చెందిన సయీద్‌ అజ్మత్‌ హుస్సేన్‌ జాఫ్రి అక్టోబరు 6న రాత్రి సమయంలో తన బైక్‌పై నూర్‌ఖాన్‌ బజార్‌ నుంచి బాల్‌షెట్టి ఖేట్‌కు వెళ్తుండగా రోడ్డుపై ఉన్న గుంతలో బైక్‌ ఒక్కసారిగా దిగబడింది. అతడు బైక్‌పై నుంచి ఎగిరి కింద పడ్డాడు. దీంతో కుడి కాలు చీలమండలోని ఎముక ఫ్రాక్చర్‌ అయింది. ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న బాధితుడు.. జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు జరిగిన అన్యాయంపై పోరాడేందుకు డబీర్‌పురా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టాడు.

తన కాలికి గాయం కావడానికి రోడ్డుపై ఉన్న గుంతలే కారణమని ఓ వ్యక్తి కేసు వేశాడు. గాయానికి జీహెచ్‌ఎంసీ అధికారులే బాధ్యత వహించాలని ఫిర్యాదు చేశాడు. రోడ్డుపై గుంతలను పూడ్చకుండా జీహెచ్‌ఎంసీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ఆరోపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Next Story