విడుదలకు ముందే కాకరేపుతోన్న 'జార్జి రెడ్డి'..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Nov 2019 11:29 AM GMT
విడుదలకు ముందే కాకరేపుతోన్న జార్జి రెడ్డి..!

ఉస్మానియానే ఊపిరిగా బతికే విద్యార్టులు

విద్యార్ధి సంఘాల మధ్య గొడవలు

కొందరిది లెఫ్ట్ థింకింగ్..మరికొందరిది రైట్ థింకింగ్

ఉస్మానియాలో పైచేయి సాధించాలనే పోరాటం

గ్రూప్‌ల మధ్య ఉస్మానియా రణక్షేత్రంగా మారింది

విద్యార్ధుల మధ్య రక్తపాతం

చదువు, భవిష్యత్తు పక్కకు పోయాయి

'జార్జిరెడ్డి' రెడ్డి హత్యతో ఉస్మానియా ఓ ధృవతారను..

దేశం మంచి విద్యావేత్తను, మేధావిని కోల్పోయిందా?

నవంబర్‌22న 'జార్జిరెడ్డి' మూవీ రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయ్యే సంచలనం సృష్టిస్తోంది. సంచలన డైరక్టర్ వర్మ కూడా సినిమా అదిరిపోయిందని ట్విట్ చేశాడు. బహూశ 'జార్జిరెడ్డి' సినిమా చూస్తుంటే వర్మకు 'శివ' సినిమా మదిలో మెదిలి ఉంటుంది. విద్యార్ధుల గొడవలు, క్యాంపస్‌లో ఆధిపత్య పోరు, రాజకీయ పార్టీల ప్రవేశం క్యాంపస్‌ల్లో సహజంగా జరుగుతుండేవే. అయితే..1970ల్లో ఉస్మానియా క్యాంపస్‌లో జరిగిన విద్యార్ది పోరు రక్త చరిత్రగా హిస్టరీలో మిగిలిపోయింది. అదే..ఇతివృత్తంగా 'జార్జిరెడ్డి' పేరుతో తెర ఎక్కించారు నిర్మాత, డైరక్టర్‌.

జార్జి రెడ్డి కేరళలో పుట్టాడు. బెంగళూరులో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. ఉన్నత విద్య కోసం హైదరాబాద్ వచ్చాడు. ఇంటర్మీడియట్, డిగ్రీ హైదరాబాద్‌లోనే పూర్తి చేశారు. ఎమ్మెస్సీ ఫిజిక్స్ ఉస్మానియా క్యాంపస్‌లో సీటు రావడంతో జాయిన్ అయ్యాడు. జార్జిరెడ్డి ఉన్నత విద్యావంతుల కుటుంబం. జార్జి రెడ్డి తండ్రి చిత్తూరు జిల్లాకు చెందిన రెడ్డి. కేరళ యువతిని పెళ్లి చేసుకున్నాడు. జార్జిరెడ్డి తల్లిదండ్రులే కాకుండా..వారి సోదరులు అందరూ విద్యావంతులే. ఈ ప్రభావం జార్జి రెడ్డిపై స్పష్టంగా కనిపించేది.జార్జిరెడ్డి చిన్నప్పటి నుంచి పుస్తకాల పురుగు. జార్జి రెడ్డి ఆలోచనలు కమ్యూనిజం, సోషలిజానికి దగ్గరగా ఉండేవి. ఆ ఆలోచనల్లోనే తన భవిష్యత్తు బాటను వెతుక్కోవడానికి ప్రయత్నించాడు, పోరాడాడు, ఆ పోరాటంలోనే ప్రత్యర్ధుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయాడు .

అసలు ఆనాడు ఉస్మానియా క్యాంపస్‌లో విద్యార్ధి రాజకీయాలు ఎలా ఉండేవి?.ఆధిపత్య పోరు ఎలా సాగింది?. విద్యార్ధులను రెచ్చగొట్టింది ఎవరు?. జార్జి రెడ్డి వెనుక ఎవరున్నారు? అతని ప్రత్యర్ధులను వెనుక నుంచి నడిపించింది ఎవరు?. జార్జి రెడ్డిని హత్య చేస్తేనే తమ మనుగడ అనుకున్నారా?. ఈ ప్రశ్నలు అన్నింటికీ సమాధానమే..'జార్జిరెడ్డి' మూవీ.

ఇప్పటికే..జార్జిరెడ్డి మూవీ పై సంఘ్ పరివార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రైలర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ సంఘాలను తప్పుగా చూపిస్తే ఒప్పుకునేదిలేదని హుకుం జారీ చేశారు. సినిమా రిలీజ్ పై ఇప్పటికే...ఏబీవీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆనాడు జార్జిరెడ్డి హత్య కేసులో ఉన్న వారు ఈ రోజున ప్రధాన పదవుల్లో ఉన్నారనే టాక్‌ కూడా నడుస్తోంది.

'జార్జి రెడ్డి' సినిమా ఆనాటి గాయాలను నేటి తరం ముందు ఉంచే అవకాశముంది. కొన్ని ప్రశ్నలకు సమాధానంగా 'జార్జి రెడ్డి' మూవీ మిగిలిపోనుంది. సో..సినిమా ఎలా ఉంటుంది..వాస్తవాలకు దగ్గరగా ఉందా? దూరంగా ఉందా ?అనేది నవంబర్ 22న తేలనుంది.





వై.వి. రెడ్డి, న్యూస్ ఎడిటర్ , న్యూస్ మీటర్

Next Story