ఉచిత విద్యుత్‌.. ఎప్పటికీ ఉచితమే : సీఎం జగన్‌

By సుభాష్  Published on  4 Sep 2020 3:08 AM GMT
ఉచిత విద్యుత్‌.. ఎప్పటికీ ఉచితమే : సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ కేబినేట్‌ గురువారం సమావేశమైంది. సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉచిత విద్యుత్‌ పథకం నగదు బదిలీకి కేబినేట్‌ ఆమోదం తెలిపింది. రైతులకు అందే విద్యుత్‌ ఎప్పటికీ ఉచితమేనని, ఒక్క కనెక్షన్‌ కూడా తొలగించమని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల వల్ల రైతుపై ఒక్కపైసా భారం కూడా పడదని హామీ ఇచ్చారు. కనెక్షన్లన్నీ రెగ్యులరైజ్‌ చేస్తామని అన్నారు. కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో వారి పేరుతో కొత్తగా బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసి, ఆ ఖాతాలోకి నేరుగా నగదు జమ చేస్తామని, ఆ డబ్బునే డిస్కంలకు చెల్లించడం జరుగుతుందని వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని, అనంతరం ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ నూతన విధానం అమలవుతుందని సీఎం జగన్ చెప్పారు. అమల్లో ఉన్న పథకాన్ని మరింత మెరుగుపరుస్తున్నామని, వచ్చే 30–35ఏళ్లపాటు ఉచిత విద్యుత్‌ పథకానికి ఢోకా లేకుండా చేస్తున్నట్లుగా తెలిపారు.

ఉచిత విద్యుత్‌ సాధ్యం కాదని.. చంద్రబాబు అన్నారని, కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవడమేనని ఎద్దేవా చేశారని.. రూ. 8 వేల కోట్ల బ్ఆయిలను పెట్టారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ బకాయిలను తీర్చామన్నారు. ఫీడర్లను అప్‌గ్రేడ్‌ చేసి నాణ్యమైన కరెంట్‌ ఇస్తున్నామన్నారు. పగటిపూట 9 గంటల కరెంట్‌ 89శాతం ఫీడర్లలో అమలు అవుతోందన్నారు. రబీ సీజన్‌ నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందన్నాని తెలిపారు.

Next Story