ఒక్కో బ్యాగ్ లో కోటి.. ఎవరు పంపారంటే

By సుభాష్  Published on  6 Jan 2020 6:19 AM GMT
ఒక్కో బ్యాగ్ లో కోటి.. ఎవరు పంపారంటే

2016 నవంబర్‌ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆకస్మికంగా పెద్ద నోట్లను రద్దుచేస్తున్నామని ప్రకటించింది. పాత రూ.500, రూ.1000 నోట్లను నిర్ణేత గడువు లోగా మార్చుకోవాలని సూచించింది. అంతే వేగంగా రూ.2 వేల నోటు, తర్వాత రూ.500 నోట్లను కూడా ముద్రించింది. అయితే ఆ నోట్లను దేశం అంతా ఎలా పంపిణి చేశారు. ఇంత పెద్ద దేశంలో ప్రజలందరికి కొత్త నోట్లు ఎలా అందాయి… ఈ డౌట్లకు మాజీ వాయుసేన చీఫ్ ధనోవా క్లారిటీ ఇచ్చారు.

పెద్ద నోట్ల రద్దు అనంతరం భారత వాయు సేన విమానాల్లో కొత్త నోట్లను దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించారట. వాయుసేన మాజీ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ బి.ఎస్‌.ధనోవా ఈ విషయాన్ని వెల్లడించారు. ముంబై లో జరిగిన టెక్నోఫెస్ట్‌ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూనోట్ల రద్దు సమయం లో తాము 33 సార్లు మొత్తం 625 టన్నుల కొత్త నోట్లను తరలించామని తెలిపారు. ఒక 20 కిలోల సంచిలో కోటి రూపాయలు పడతాయనుకుంటే ఈ లెక్కన ఎన్ని కోట్లను తరలించామో కూడా తనకు తెలియదన్నారు.

పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదును ప్రభుత్వం వివిధ ప్రాంతాలకు పంపించింది. కానీ ఎలా పంపింది, కొందరికైనా నోట్ల రద్దు విషయం ముందే తెలుసా వంటి అనుమానాలు చాలా వచ్చాయి. అటు ప్రభుత్వం కూడా ఈ విషయం పై ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన మాత్రం చేయలేదు. కానీ ధనోవా తాజాగా ఈ సస్పెన్సు రిలీవ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2016 డిసెంబర్ 31 నుంచి 2019 సెప్టెంబర్ 30 వరకు భారత వాయుసేన అధిపతిగా ధనోవా విధులు నిర్వహించారు.

Next Story