ఇటలీలో రోడ్డు మీద డబ్బుల కట్టలు.. నిజమెంత..?

By సుభాష్  Published on  3 April 2020 7:57 AM GMT
ఇటలీలో రోడ్డు మీద డబ్బుల కట్టలు.. నిజమెంత..?

కోవిద్-19 కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వేల మంది మరణించారు. స్థాయి, ఆస్థి, కులం, మతం, జాతి అన్న తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. కరోనా వైరస్ చైన్ ను బ్రేక్ చేయాలని, ఇన్ఫెక్షన్ల బారి నుండి తప్పించుకోవాలని అందరూ ఇళ్లల్లో ఉంటున్నారు. ఆసుపత్రుల్లో ఇప్పటికే చాలా మంది చికిత్స పొందుతూ ఉన్నారు. కొన్ని దేశాల్లో వైద్య సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని దేశాల్లో వైరస్ ప్రబలకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు అధికారులు.

ఇలాంటి సమయంలో ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ లలో కొన్ని ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి. అందులో డబ్బులు కుప్పలు కుప్పలుగా రోడ్ల మీద పారేయడం ఉన్నాయి.

Fact Check3

"ఇటలీకి చెందిన ప్రజలు డబ్బు ఇలా రోడ్ల మీద పారేస్తున్నారని.. ఎందుకంటే ఆ డబ్బు తమ ప్రాణాలను కాపాడలేదని తెలుసుకున్నారని అందుకే పారివేశారంట. ఎవరికైనా అవసరం ఉంటే దానిని తీసుకుని వాడుకోవాలట. ఇది మానవాళికి ఒక గుణపాఠం" అని ఆ పోస్టులో ఉంది. ఇంకేముంది ఇది అందరికీ తెలియాలని పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు.

ఈ ఆర్టికల్ ను https://ghanashowbiz.com అనే వెబ్సైట్ లో ఉన్నట్లు కనిపెట్టాము. దానికి ఓ టైటిల్ “(Sad Reality): Italians Abandon All Their Money on the Streets because it’s Useless and Can’t Save Them from Death – Photos”(ఇటలీకి చెందిన వాళ్ళు తమ డబ్బునంతా రోడ్ల మీదకు పారవేస్తున్నారు.. ఎందుకంటే ఆ డబ్బు తమను చావు నుండి కాపాడలేదు అని తెలుసుకున్నారు.. అందుకు సంబంధించిన ఫోటోలు) పెట్టారు.

ఈ ఆర్టికల్ లో ఇటలీ కరోనా వైరస్ బారిన పడి తీవ్రంగా నష్టపోయిందని.. ఆ దేశ ప్రజలు డబ్బులను పారవేస్తున్నారని.. కరోనా మహమ్మారి ప్రభావం వారిపై చూపించిందని.. డబ్బు దేనికీ పనికి రాదని వారు భావిస్తున్నారు అని రాసుకొచ్చారు.

నిజమెంత :

పైన చెప్పినదంతా పచ్చి అబద్ధం.. ఎంత మాత్రం నిజం లేదు.

ఈ ఫోటోలను గూగుల్ రివర్స్ ఇమేజ్ సర్చ్ లో వెతకగా కొన్ని రిజల్ట్స్ దొరికాయి. Imgur గతంలో వైరల్ అయినా ఫోటోలకు సంబంధించిన సమాచారాన్ని ముందు ఉంచింది. “A bank was looted in Venezuela, and then the people burned the money to show it was worthless.”(వెనిజులా లోని ఓ బ్యాంకును దొంగతనం చేశారని.. ఆ తర్వాత ఆ డబ్బు దేనికీ పనికిరాదు అని తెలియగానే దాన్ని ప్రజలు తగులబెట్టారు) అని ఉంది.

ఈ పోస్టు మొదటి సారిగా మార్చి 12, 2019న పబ్లిష్ చేశారు. దీనిని బట్టి మనకు తెలిసిందేమిటంటే కోవిద్-19 మహమ్మారికి ఈ ఫోటోలకు ఎటువంటి సంబంధం లేదని..! ముఖ్యంగా ఈ ఘటన చోటుచేసుకుంది వెనిజులాలో.. ఇటలీలో కాదు.

ఏప్రిల్ 5, 2019న స్నోప్స్ ఫ్యాక్ట్ చెకింగ్ రిపోర్ట్ ప్రకారం తెలిసిందేమిటంటే వెనిజులా ప్రజలు కరెన్సీ నోట్లను చెత్తలో పారవేస్తున్నారు.. సోషలిజం కారణంగా ఆ డబ్బుకు ఎటువంటి విలువ లేకపోవడంతో ఇలా వీధుల్లో పారవేశారు.



అప్పటి రిపోర్ట్ ప్రకారం వెనిజులా ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆయిల్ ధరలు పతనమవ్వడం, ప్రభుత్వ అవినీతి, రాజకీయ సంక్షోభం, సోషలిస్ట్ వ్యవస్థ కారణంగా ఆ దేశ కరెన్సీ తీవ్రంగా పతనమైంది. దీంతో వెనిజులా కరెన్సీ అయిన 'బొలీవర్ ఫుఎర్టే' ను తీసేసి 'బొలీవర్ సోబెర్నో' ను ఆగస్టులో ప్రవేశపెట్టారు. 2018, డిసెంబర్ 5 లోపు మొత్తం డబ్బును వెనక్కు తీసుకుని బొలీవర్ సోబెర్నోను వాడుకలోకి తీసుకుని వచ్చారు. దీంతో పాత కరెన్సీ అయిన బొలీవర్ ఫుఎర్టే ను వీధుల్లో పారవేశారు అక్కడి ప్రజలు. ఈ ఫోటోలన్నీ వెనిజులాకు చెందినవే.. కరోనా వచ్చిన సమయంలో ఇటలీలో చోటుచేసుకుంది ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు.

https://imgur.com/gallery/cjndk8o#lirey5Z

ఈ ఫోటోలను మర్చి 11, 2019న పలు మీడియా సంస్థలు ప్రచురించాయి. వెనిజులాలో అప్పటి పరిస్థితిని ప్రపంచానికి తెలియజేశాయి.

దీన్ని బట్టి అందరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే వైరల్ అవుతున్న ఫోటోలు వెనిజులాకు చెందినవి. ఇటలీకి చెందిన అసలు కావు. వెనిజులాలో అలా నడిరోడ్డులో కరెన్సీని పారేయడానికి కారణం.. ఆ డబ్బుకు విలువలేదని ప్రభుత్వం తేల్చి చెప్పడమే..! కాబట్టి ఇటలీ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నదంతా పచ్చి అబద్ధం.



Next Story