శీతల ఆహారం తీసుకుంటే కొరోనా వైరస్ సోకుతుందా..?? : నిజ నిర్ధారణ

By రాణి  Published on  28 Jan 2020 10:23 AM GMT
శీతల ఆహారం తీసుకుంటే కొరోనా వైరస్ సోకుతుందా..?? : నిజ నిర్ధారణ

కొరోనా వైరస్, చైనా వాసులనే కాదు, ప్రపంచం మొత్తాన్నీ వణికిస్తోంది. చైనా లోని వూహాన్ మార్కెట్ లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయపడుతోంది. దీనివల్ల ఈ వైరస్ గురించి తప్పుడు వార్తలు కూడా ఎన్నో ప్రచారంలోకి వస్తున్నాయి.

అలాంటి ఒక మెసేజ్ వాట్సాప్ లో వైరల్ అవుతోంది. 'కొరోనా వైరస్, వైరస్ యొక్క చాలా కొత్త ప్రాణాంతక రూపం, చైనా బాధపడుతోంది, వెంటనే భారతదేశానికి రావచ్చు, శీతల పానీయాలు, ఐస్ క్రీములు, కుల్ఫీ మొదలైన వాటికి దూరంగా ఉండాలి. 48 గంటలు దాటిన ఆహార పదార్థాలు తినరాదు, ఈ రోజు నుండి కనీసం 90 రోజులు.'.

ఇంకో మెసేజ్ 'మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వారు జారీ చేసిన సలహాలు అంటూ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. 'ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే గొంతు లో తడి ఆరకుండా చూసుకోవాలి, 10 నిమిషాలు దాహార్తిని అణచివేసుకున్నా వెంటనే ఈ వైరస్ దాడి చేయగలదని, మార్చి నెల చివరి వరకూ రద్దీగా ఉన్న స్థలాలకి వెళ్లకూడదని’ సలహాలను మంత్రివర్గంవారు జారీ చేశారని ఈ మెసేజ్ తాత్పర్యం.

నిజ నిర్ధారణ:

ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య నిపుణుల ప్రకారం, కొరోనా వైరస్ గబ్బిలాలు, పాములు వంటి జంతువుల వల్ల పాకుతుంది.

అంతే కానీ, ప్రచారం జరుగుతున్నట్టు శీతల పానీయాలు, ఐస్ క్రీములు, కుల్ఫీ వంటి పదార్ధాల వల్ల సోకదు.

గొంతుకను ఎప్పుడు తడిగా ఉంచుకోవాలంటూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు సలహా జారీ చేశారనేది కూడా తప్పుడు వార్త. ఇలాంటి ఆదేశాలని మంత్రివర్గం వారు జారీ చేయలేదు. వారు కేవలం చైనా వెళ్లాలనుకునేవారికి సలహాలను జారీ చేశారు.

కొరోనా వైరస్ కొత్తగా కనుగొన్న వైరస్. అందువల్ల అది సోకితే ఉండే లక్షణాలు తెలుస్తాయి తప్ప దాని చికిత్స ఇంకా డాక్టర్లకు తెలియలేదు. అందువల్ల కేవలం శుభ్రత పాటించడం వంటి నివారణ చర్యలే తప్ప మంత్రివర్గం వారు ఇతర చికిత్సల గురించి ఉత్తరువులు జారీ చేయలేదు.

జనవరి 1వ తారీఖు తరువాత చైన వెళ్లివచ్చినవారి కోసం ఒక సహాయక ఫోన్ నంబర్ ను కూడా వారు ప్రకటించారు. ఇతర జలుబు, దగ్గు వైరస్ ల లాగా కొరోనా వైరస్ గాలితో ప్రబలుతుంది. గొంతు, ముక్కు వాపు ఉండటం, పొడి దగ్గు, సాధారణ జ్వరం ఈ వ్యాధి లక్షణాలు. సాధరణ జ్వరమా లేక కొరోనా వరస్ తో వచ్చిందా అనే విషయం తెలియడం కష్టమే.

ఈ వైరస్ చైనా లో మొదలయ్యింది, భారత దేశానికి ఇంకా ఈ వైరస్ పాకిన సూచనలు లేవు. అనవసరపు ఆందోళనకు గురి కాకుండా శుభ్రంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం. అందువల్ల, జరుగుతున్న రెండు ప్రచారాలూ తప్పుడు ప్రచారాలే.

B N Satya Priya

Claim Review:శీతల ఆహారం తీసుకుంటే కొరోనా వైరస్ సోకుతుందా..?? : నిజ నిర్ధారణ
Claim Fact Check:false
Next Story