స్వీయ నిర్బంధంలోకి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత
By సుభాష్ Published on 24 July 2020 3:55 PM IST
సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆమె వద్ద పని చేసే డ్రైవర్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో కవిత హోం క్వారంటైన్లోకి వెళ్లారు. వైద్యుల సూచన మేరకు ముందు జాగ్రత్తగా క్వారంటైన్లోకి వెళ్లినట్లు కవిత సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, తెలంగాణలో ఇప్పటికే మంత్రి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. ఇక రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50వేలు దాటేసింది.
కరోనా బారిన హోంశాఖ మంత్రి మహమూద్ ఆలీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్గుప్తా, సతీష్ కుమార్లకు కరోనా సోకింది. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా కరోనా బారిన పడ్డారు. ఆయన చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. అలా రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పోలీసులు, అధికారులను సైతం కరోనా బారిన పడుతున్నారు. ప్రభుత్వం కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏమాత్రం తగ్గడం లేదు.
కాగా, నిన్న ఒక్క రోజు తెలంగాణ రాష్ట్రంలో 13,367 మందికి పరీక్షలు చేయగా, 1567 మందికి పాజిటివ్ తేలింది. అలాగే తొమ్మిది మంది మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 50,826 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 447 మంది మృతి చెందారు.