వివేకాను హత్య చేయించిందెవరో అందరికీ తెలుసు : మాజీ మంత్రి ఆదినారాయణ
By రాణి Published on 12 Dec 2019 1:26 PM IST
కడప : మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి గురువారం ఉదయం సిట్ విచారణకు హాజరయ్యారు. వైఎస్ వివేకానంద హత్య కేసు దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరు కావాలని రెండ్రోజుల క్రితం ఆయనకు నోటీసులందాయి. ఆదినారాయణ రెడ్డితో పాటు వివేకానంద వ్యక్తిగత కార్యదర్శికృష్ణారెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు. దాదాపు గంటసేపు విచారణ పూర్తయిన అనంతరం ఆదినారాయణ మీడియాతో మాట్లాడారు. ''వివేకా హత్యకేసులో భాగంగా నన్ను పిలిచారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పా''. వివేకా హత్యకు సంబంధించి అన్ని కోణాల్లో 30 ప్రశ్నలు అడిగినట్లు ఆదినారాయణ వెల్లడించారు. అన్నింటికీ వివరంగా సమాధానమిచ్చానని, ఇందులో నా తప్పు ఉంటే బహిరంగంగా ఉరి తీయాలని అధికారులకే చెప్పానన్నారు. వివేకానంద హత్యకేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని, అప్పుడే నిజానిజాలు బయటికొస్తాయని ఆదినారాయణ రెడ్డి డిమాండ్ చేశారు.
నిజానికి వివేకాను ఎవరు హత్య చేయించారో అందరికీ తెలుసు. వివేకానంద హత్యకు గురైన రోజున నేను విజయవాడలో ఉన్నాను. హత్య జరిగిన వెంటనే జగన్ కావాలనే హై కోర్టులో రిట్ వేశారని ఆది ఆరోపించారు. నిజంగా వివేకా హత్య కేసుతో తమకెలాంటి సంబంధం లేకపోతే జగన్ సీఎం కాక ముందే ఎందుకు సిట్ దర్యాప్తు కోరలేదు ? జగన్ సీఎం అయ్యాక ఎందుకు సిట్ వేశారు ?'' అని ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు.