గుడి కట్టించి.. తల్లి కోరిక నెరవేర్చిన హీరో విజయ్ దళపతి
విజయ్ దళపతి సాయిబాబా గుడి కట్టించారనీ.. అది ఆయన తల్లి కోరిక మేరకే కట్టించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
By Srikanth Gundamalla Published on 13 April 2024 7:36 AM IST
గుడి కట్టించి.. తల్లి కోరిక నెరవేర్చిన హీరో విజయ్ దళపతి
తమిళ హీరో విజయ్ దళపతి తెలుగులో కూడా చాలా ఫేమస్. ఇక్కడ కూడా ఆయన సినిమాలు రికార్డు కలెక్షన్లు సాధిస్తుంటాయి. విజయ్ దళపతికి ఫ్యాన్స్ బాగా ఉంటారు. ఆయన బయట కనబడితే చాలు ఒక్కసెల్ఫీ అయినా తీసుకోవాలని ఎగబడుతుంటారు. అయితే.. ఈ మధ్యకాలంలో విజయ్ దళపతికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. విజయ్ దళపతి సాయిబాబా గుడి కట్టించారనీ.. అది ఆయన తల్లి కోరిక మేరకే కట్టించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా ఇదే విషయంపై విజయ్ తల్లి శోభ క్లారిటీ ఇచ్చారు.
విజయ్ దళపతి తన కోసం గుడి కట్టించారని ప్రచారం అవుతున్న వార్త వాస్తవమే అని ఆయన తల్లి శోభ వెల్లడించారు. సాయిబాబా మందిరం నిర్మించాలని తనకు ఎప్పటి నుంచో కోరిక ఉండేదని అన్నారు. ఈ విషయాన్ని విజయ్తో తానే ఎన్నో సార్లు చెప్పానని అన్నారు. తన ఇష్టాన్ని అర్థం చేసుకున్న విజయ్ దళపతి.. కొంతకాలం క్రితమే చెన్నైలో సాయిబాబా మందిరం నిర్మించినట్లు తల్లి శోభ వెల్లడించారు. ఇక ప్రతి గురువారం తాను ఆ మందిరానికి వెళ్తుంటానని చెప్పారు. స్వామివారిని దర్శించుకుంటానన్నారు. విజయ్ దళపతి కూడా పలు సందర్భాల్లో సాయిబాబా మందిరానికి వచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నాడు. ఇక మరోవైపు ఇదే మందిరంలో ప్రతి రోజూ అన్నదానం చేసి ప్రజల కడుపు నింపాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.
కాగా.. విజయ్ దళపతి చెన్నైలోని సాయిబాబా ఆలయాన్ని ఇటీవల సందర్శించారు. ఈ సందర్భంగా పూజారులతో కలిసి ఆయన ఒక ఫొటో దిగారు. కొద్దిరోజులుగా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతేకాదు.. ఆ గుడిని విజయ్ దళిపతే కట్టించారంటూ ప్రచారం జరిగింది. ఇదే ప్రచారంపై స్పందించిన విజయ్ తల్లి శోభ అవును అది వాస్తవమే అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఇక విజయ్ దళపతి ప్రస్తుతం 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' సినిమాలో నటిస్తున్నారు. దీనికి వెంకట ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. టైమ్ ట్రావెల్ కథతో సైన్స్ ఫిక్షన్గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదిరి హీరోయిన్.. ప్రశాంత్, ప్రభుదేవాలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.