'సలార్' షూటింగ్ ఎక్కువ అక్కడే పూర్తిచేశాం: ప్రశాంత్‌నీల్

'సలార్‌' సినిమా గురించి డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పాడు.

By Srikanth Gundamalla  Published on  2 Dec 2023 6:04 AM GMT
salaar movie, director,  shooting, prabhas,

'సలార్' షూటింగ్ ఎక్కువ అక్కడే పూర్తిచేశాం: ప్రశాంత్‌నీల్

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్.. కేజీఎఫ్‌ వంటి బ్లాక్‌ బాస్టర్‌ సినిమాలు తీసిన డైరెక్టర్‌ ప్రశాంత్‌నీల్‌తో ప్రస్తుతం 'సలార్‌' సినిమా తీశారు. ఈ మూవీ కోసం సినిమా ప్రియులంతా ఎంతగానో వెయిట్‌ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రెయిలర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రభాస్‌ యాక్షన్‌కు అభిమానులంతా ఫిదా అవుతున్నారు. ట్రైయిలర్‌లోనే ఇలాంటి విజువల్స్‌ కనిపించాయి అంటే.. సినిమా మొత్తం చూస్తే అదిరిపోతుంది అభిమానులంతా భావిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ సినిమా గురించి డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పాడు.

'సలార్‌' సినిమా కథ ఇప్పటిది కాదు అనీ.. 15 ఏళ్ల క్రితమే రాసుకున్నా అని ప్రశాంత్‌ నీల్ చెప్పాడు. తన మొదటి సినిమా 'ఉగ్రం' చేసిన తర్వాత 'కేజీఎఫ్‌' మొదలు పెట్టినట్లు వెల్లడించారు. కేజీఎఫ్‌ను రెండు భాగాలుగా తీసిన విషయం తెలిసిందే. ఆ సినిమాను పూర్తి చేయడానికి మొత్తం 8 సంవత్సరాలు పట్టిందన్నాడు ప్రశాంత్‌నీల్. ఇక కేజీఎఫ్‌ తర్వాత సలార్‌ సినిమాను చిత్రీకరించేందుకు పనులు ప్రారంభించినట్లు చెప్పారు. సలార్‌ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం రామోజీ ఫిల్మ్‌ సిటీలోనే పూర్తి చేశామని ప్రశాంత్‌ నీల్ చెప్పారు. అలాగే సింగరేణి ఐన్స్, సౌత్‌ పోర్ట్స్‌, వైజాగ్ పోర్ట్స్‌లో కూడా కొన్ని షెడ్యూళ్లు చేశామన్నారు. యూరప్‌లో మరికొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లు ప్రశాంత్‌నీల్ చెప్పారు. మొదటి భాగాన్ని 114 రోజుల్లో పూర్తి చేశామని ప్రశాంత్‌ నీల్ చెప్పారు. ఇక సలార్‌ రెండో భాగం కూడా త్వరలో తీస్తామని.. దానికి పనులు కూడా ప్రారంభిస్తామని ప్రశాంత్‌నీల్ వెల్లడించారు.

సలార్ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇద్దరు స్నేహితులు బద్ద శత్రువులుగా మారే కథతో సలార్‌ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ప్రభాస్‌ సరసన హీరోయిన్‌గా శృతిహాసన్‌ కనిపించనున్నారు. ఈ మూవీలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటించారు. మరికొందరు టీనూ ఆనంద్, జగపతి బాబు, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Next Story