త్రిష, చిరంజీవి, కుష్బూలపై పరువునష్టం దావా వేసిన మన్సూర్

తమిళ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు.

By Srikanth Gundamalla  Published on  9 Dec 2023 4:22 AM GMT
mansoor ali khan,  petition,  chiranjeevi, trisha,

త్రిష, చిరంజీవి, కుష్బూలపై పరువునష్టం దావా వేసిన మన్సూర్

తమిళ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. మెగాస్టార్‌ చిరంజీవితో పాటు త్రిష, కుష్బూలపై ఆయన పరువునష్టం దావా వేశారు. కొద్దిరోజుల ముందు నటుడు మన్సూర్ అలీఖాన్‌ త్రిష గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన కామెంట్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. తన పరువుకి భంగం కలిగించే విధంగా ఈ ముగ్గురూ వ్యాఖ్యలు చేశారని మన్సూర్ అలీ అన్నాడు. మొత్తం వీడియో చూడకుండా ప్రతిష్టను దిగజార్చారంటూ ఆరోపించారు. అలాగే.. వారిపై నుంచి కోటి రూపాయల పరువు నష్టం దావా దాఖలు చేశారు మన్సూర్. ఇతని పిటిషన్‌పై మద్రాస్‌ హైకోర్టు ఈ నెల 11న విచారణ జరపనుంది.

నటి త్రిష కృష్ణన్‌పై మన్సూర్ ఖాన్ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను నటి త్రిష క్రిష్ణన్‌ తో పాటు, లియో సినిమా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్, మాళవిక మోహనన్, మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువరు నటీనటులు స్పందించారు. తమిళ నటుల సంఘాలు ఆయన కామెంట్స్‌ను తీవ్రంగా ఖండించాయి. దీని తర్వాత నటి, పొలిటీషియన్, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు కుష్బూ ఆ కామెంట్స్‌పై తమిళనాడు డీజీపీకి ఫిర్యాదు చేశారు. మన్సూర్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూలేఖ రాశారు. ఈ క్రమంలోనే చెన్నై పోలీసులు మన్సూర్‌ అలీఖాన్‌పై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇక ఈ కంప్లైంట్‌ విషయంలో మన్సూర్‌ అలీఖాన్‌ చెన్నై హైకోర్టుకు వెళ్లారు. ముందస్తు బెయిల్‌ దరఖాస్తు చేసుకున్నారు. కానీ.. ఆయన బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. మరోవైపు మన్సూర్ అలీ కామెంట్స్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దాంతో.. అప్పుడే త్రిషకు మన్సూర్ క్షమాపణలు కూడా చెప్పాడు. కానీ.. తన పరువుకి భంగం కలిగించారంటూ మద్రాస్‌ హైకోర్టు మన్సూర్‌ అలీఖాన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో త్రిష, చిరంజీవి, ఖూష్బూల పేర్లను ప్రస్తావించారు మన్సూర్.


Next Story