'పుష్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్ పై కేసు నమోదు చేసిన పోలీసులు

Case files against Pushpa movie pre-release event.టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందాన నటించిన పుష్ప

By M.S.R  Published on  13 Dec 2021 10:00 AM GMT
పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ పై కేసు నమోదు చేసిన పోలీసులు

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందాన నటించిన 'పుష్ప' సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీగానే హైదరాబాద్ లో నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఈవెంట్ ను నిర్వహించారని.. 5 వేల పాస్‌లకు అనుమతి తీసుకుని ఇంకా ఎక్కువ జారీ చేశారని నిర్ధారించిన పోలీసులు శ్రేయాస్ క్రియేషన్స్ మీడియాతో పాటు ఈవెంట్ ఆర్గనైజర్‌పై కేసు నమోదు చేశారు. ఈవెంట్ ఆర్గనైజర్ కిశోర్‌పై ఐపీసీ సెక్షన్ 143, 341, 290 కింద కేసు నమోదు చేశారు.

ఆదివారం సాయంత్రం యూసఫ్ గూడలోని పోలీసు గ్రౌండ్స్‌లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. బ్యారికేడ్లు దాటుకుని జనం రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ నేపధ్యంలో ఈవెంట్ నిర్వాహకులు జనాన్ని అదుపు చేసే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. తొక్కిసలాట నేపధ్యంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈవెంట్‌కు ఎంతమంది వచ్చారనేది ఆరా తీసినప్పుడు పాస్‌ల సంగతి బయటపడింది. దీంతో ఈవెంట్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొందరికి గాయాలు అయ్యాయనే విషయం తెలుసుకున్న రష్మిక సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. 'ఈ ఈవెంట్ కు హాజరైన అందరికి ధన్యవాదాలు .. మీలో కొందరికి గాయాలయ్యాయని తెలిసింది .. చాలా బాధేసింది.. జాగ్రత్తగా ఉండండి' అని తెలిపింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో.. బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. అలాగే రష్మిక పల్లెటూరి యువతిగా డీగ్లామర్ లుక్ లో కనిపించనుంది. ఇక పుష్ప సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story